
జిల్లాకు రెండు మోడ్రన్ డ్రోన్స్
విజయనగరం క్రైమ్: జిల్లాలో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘా ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపొందించిన రెండు టెథర్డ్ డ్రోన్స్ను రాష్ట్ర పోలీసు శాఖ జిల్లాకు మంజూరు చేసిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సాధారణ డ్రోన్స్కు భిన్నంగా, ప్రత్యేక అవసరాలకు కోసం రూపొందించిన టెథర్డ్ డ్రోన్ పని తీరును గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరిశీలించారు. ఒక నిర్దిష్ట ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘాను ఏర్పాటు చేసేందుకు టెథర్డ్ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. సుమారు 10గంటలపాటు గాలిలో తేలుతూ ఒక నిర్ధిష్ట ప్రదేశంలో జరిగే కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేసే సామర్ధ్యం కలిగి ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ పవర్ లేదా జనరేటర్ సహాయంతో ఒక కేబుల్ ఆధారంగా డ్రోన్ పని చేస్తుందని తెలిపారు. జీపీఎస్ అవాంతరాలు ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ డ్రోన్ పని చేసే సామర్ధ్యంతో పాటు అదనంగా పబ్లిక్ అడ్రస్ సిస్టం, డే/నైట్ విజన్ కెమెరా, ఏఐ కెమెరాలను కలిగి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఆర్వీఆర్కే చౌదరి, ఏవీ లీలారావు, డ్రోన్ పైలట్స్ నరేష్, వెంకటేష్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పరిశీలించిన ఎస్పీ వకుల్ జిందల్