
రక్తహీనతతో ఎవరూ బాధ పడకూడదు
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ఏ ఒక్కరూ రక్తహీనతతో బాధపడకూడదని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్వతీపురం మండలం ఎమ్మార్నగరం గ్రామ సచివాలయంలో నిర్వహించిన రక్తహీనత నివారణ కమిటీ (అనీమియా యాక్షన్ కమిటీ)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి సచివాలయం పరిధిలో అనీమియా యాక్షన్ కమిటీ సమావేశాన్ని ప్రతి నెలా మొదటి బుధవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. గర్భిణులు, డెలివరీ కేసులను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని, అలాగే గర్భిణులకు చేయాల్సిన నెలవారీ పరీక్షలు, ప్రసవం అనంతరం పసిపిల్లలకు సమయానుకూలంగా ఇవ్వాల్సిన ఇంజక్షన్లు తదితర వాటిని ఏఎన్ఎంలు బాధ్యతాయుతంగా చేయాలని ఆదేశించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
అనీమియా లోపంతో బాధపడుతున్న వారిపట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు. అనీమియా నివారణకు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సక్రమంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం ప్రజలతో కలిసి టీబీ వ్యాధి పట్ల శ్రద్ధ వహించండి, టీబీ రహిత భారత్కు సహకరించండి అనే వాల్పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా.ఎం.వినోద్ కుమార్, తహసీల్దార్ వై.జయలక్ష్మి సీడీపీఓ బి.శ్రీనివాసరావు, డాక్టర్ పి.గోపాల్ కృష్ణ, సర్పంచ్ త్రినాథ రావు, వైద్యసిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యామ్ప్రసాద్