
ముమ్మరంగా మొక్కజొన్నలు విత్తుతున్న రైతులు
సాలూరు రూరల్: మండలంలోని రైతులు మొక్కజొన్న విత్తనాలు జూన్ మొదటి వారంలోనే నాటుతున్నారు. తొలకరి జల్లులు తొందరగా పలకరించడంతో రైతులో ఆనందం వెల్లివిరుస్తోంది. తొందరగా విత్తులు నాటితే తొందరగా పంట చేతికి వస్తుందన్న ఆశతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇది ఇలా ఉండగా గత ఏడాది ఇలాగే జూన్ తొలి వారంలో ఉడిచిన మొక్కజొన్నలు వర్షాలు లేక ఎండిపోయి చాలావరకు రైతులు మలి విడత విత్తనాలు వేసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో శివరాంపురం గ్రామంలో రైతులు పంట నష్టపోవడంతో వ్యవసాయ అధికారులు మొక్కజొన్నలు జూన్ మూడవ వారంలో నాటాలని రైతులకు సూచించారు. అలా అయితే చీడపీడలు కూడా తక్కువగా ఆశిస్తాయని రైతులకు చెప్పారు. అయితే ఈ ఏడాది రైతులకు ఈ విషయంలో సచివాలయ సిబ్బంది కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతులకు తగు సూచనలు సలహాలు ఇవ్వకపోవడంతో రైతులు అదును పోతుందేమోనన్న తొందరపాటులో చిన్నచిన్న పొరపాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో రైతులకు తగు జాగ్రత్తలు వ్యవసాయ అధికారులు సూచించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.