
‘వెన్నుపోటు దినం’కు తరలిరండి
సాలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 4న వెన్నుపోటు దినం నిర్వహించనున్నామని, దీనికి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. పట్టణంలోని తన స్వగృహంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలతో పాటు గత వైఎస్సార్సీపీ పథకాలను అమలు చేస్తామని ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన తరువాత మోసం చేశారని దుయ్యబట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారిని సైతం ధైర్యంగా ఎదుర్కొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, అభివృద్ధి పనులు చేపట్టిన జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఎన్నడూ మరచిపోరన్నారు. అధికారంలోకి వస్తూనే వలంటీర్లును తొలగించారని, ఇప్పుడు ఎండీయూ ఆపరేటర్లను తొలగించారని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్లు, ఐఆర్లు, డీఏలు ఇవ్వలేని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. ఇందుకు నిరసనగా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 4న వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో నిరసన ర్యాలీ బోసు బొమ్మ జంక్షన్ వరకు చేపడతామన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం ఇస్తామన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, బాధిత వలంటీర్లు, ఎండీయూ ఆపరేటర్లు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం
మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర