
పార్వతీపురంలో పండగ శోభ
పార్వతీపురంటౌన్: పార్వతీపురానికి పండగ శోభ వచ్చింది. గ్రామదేవతలైన ఇప్పలపోలమ్మ, ఎర్ర కంచమ్మ, బంగారమ్మ గ్రామదేవతల జాతరకు వేళయింది. ఆదివారం నుంచి బుధవారం వరకు నాలుగు రోజుల పాటు సాగే జాతరలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు ఆంధ్రా, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తారు. మొక్కుబడులు చెల్లిస్తారు. ఏజెన్సీకి ముఖద్వారంగా ఉండే పార్వతీపురంలో జరిగే జాతరలో ఉత్సాహంగా పాల్గొంటారు. జిల్లా ఏర్పడిన తరువాత 2023లో జాతరను వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆ స్థాయి ఏర్పాట్లు కనిపించడం లేదన్నది భక్తుల మాట. తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు పట్టణ ప్రజలకు సవాల్గా మారాయి.
విద్యుత్ అలంకరణ
పట్టణ ప్రధాన రహదారి సారికి వీధి నుంచి పాత బస్టాండ్ వరకు విద్యుత్ దీపాలను అలంకరించారు. వైకేఎం కాలనీ, బంగారమ్మ కాలనీలో విద్యుత్ అలంకరణ అందరినీ ఆకర్షిస్తోంది. ఉత్సవాలకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలీసుల కసరత్తు
ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అల్లరి మూకలు, సంఘ వ్యతిరేక శక్తులు కదలికలపై నిఘా పెంచారు. ఉత్సవాల విజయవంతానికి ప్రజలు సహకరించాలని కోరారు. సారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఎకై ్సజ్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టింది. పోలీసు శాఖ పట్టణంలో ముమ్మర తనిఖీలతోపాటు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసింది.
ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు
జిల్లా కేంద్రంలో నిర్వహించే జాతరలో భాగంగా మంగళవారం ఇప్పలపోలమ్మ, ఎర్రకంచమ్మ గ్రామ దేవతలకు సంబంధించిన రెండు సిరిమానులు తిరుగుతాయి. పార్వతీపురం పట్టణానికి ప్రధాన బైపాస్ రోడ్డు లేకపోవడం, ఉన్న బైపాస్ రహదారిలో కేవలం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ప్రధాన రహదారిపై పాలకొండ, రాయగడ, కూనేరు, కురుపాం, కొమరాడ మండలాలకు వెళ్లే బస్సుల దారి మళ్లింపునకు పోలీసు సిబ్బంది చర్యలు చేపట్టారు. సిరిమాను తిరిగే సమయంలో ట్రాఫిక్ను అదుపు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.
తాగునీరు అందేనా..
పట్టణ ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతున్నా పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడం లేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు రోజులకోసారి కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. పండగ నాలుగు రోజులు ఇదే ఒరవడి కొనసాగితే తీవ్ర ఇబ్బందులకు గురవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నా ఆచరణలో సాధ్యం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ లైన్ల నిర్వహణ, చెట్టుకొమ్మలు కొట్టడం వంటి కారణాలతో వారంలో మూడు రోజులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సిరిమానులు తిరిగే సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం సహజమే. ప్రస్తుతం పండగ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, లైన్ క్లియరెన్స్ల పేరిట మూడు రోజులుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. కనీసం పండగ సమయాల్లోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నేటి నుంచి ఇప్పలపోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మల జాతర
నాలుగు రోజులపాటు నిర్వహణ
పట్టణ సమస్యల పరిష్కారంలో మున్సివల్ యంత్రాంగం వైఫల్యం
వెంటాడుతున్న తాగునీరు, విద్యుత్ సమస్యలు
ట్రాఫిక్ మళ్లింపునకు పోలీసుల ఏర్పాట్లు
పండగ సాగేదిలా..
జాతర మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఉయ్యాల–కంబాల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రెండవ రోజు సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం అమ్మవార్ల ఘటాలు, సిరిమాను ఊరేగింపులు సాగుతాయి. బుధవారం ఘటాల అనుపోత్సవం ఉంటుంది. ఉత్సవాల నాలుగు రోజులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్వతీపురంలో పండగ శోభ

పార్వతీపురంలో పండగ శోభ