
పరిశ్రమలకు సకాలంలో అనుమతులు
● డీఐఐపీసీ సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతో పాటు, యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామికవాడల స్థాపనకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, రుణ మంజూరు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఏ శాఖ వద్ద దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని సూచించారు. పీఎం విశ్వ కర్మ యోజన పథకానికి ఇప్పటి వరకు మంజూరు చేసిన రుణాల పట్ల అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాలో ఏపీఐఐసీకి ఇప్పటి వరకు సుమారు 2,400 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ వాటిలో కేవలం 300 పైచిలుకు ఎకరాల ను మాత్రమే వినియోగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భూముల వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జీఎం శ్రీధర్, ఏడీ రామకృష్ణ, విజయనగరం ఆర్డీఓ టి.సవరమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.