
ప్రతీ ఒక్కరిని యోగాంధ్రలో భాగస్వాములు చేయాలి
పార్వతీపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా జూన్ 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న యోగాంధ్రా కార్యక్రమాల్లో ప్రతీ ఒక్కరిని భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరూ పని ఒత్తిడిలో ఆరోగ్యం పట్ల సరైన దృష్టి సారించడం లేదని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలన్నారు. అయితే యోగాను శిక్షకుల ద్వారా వారి సమక్షంలో మాత్రమే చేయాలని, ఇందుకోసం మాస్టర్ ట్రైనీలను సిద్ధం చేసినట్టు తెలిపారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించేలా షెడ్యూల్ను అధికారులకు పంపామన్నారు. షెడ్యూల్లో సూచించిన మేరకు కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. నెల రోజల పాటు గ్రామ, వార్డు, మండల, జిల్లా స్థాయిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు తదితరులు అందరూ పాల్గొనేలా చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్