
బృహత్తర ప్రణాళికపై అభ్యంతరాల స్వీకరణ
విజయనగరం: విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో రూపొందించిన బృహత్తర ప్రణాళికపై ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలు కోరుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య శనివారం తెలిపారు. 2021లోనే బృహత్తర ప్రణాళికను ఆమోదించడం జరిగిందని, ప్రస్తుతం వీఎంఆర్డీఏ పరిధిలోని పట్టణాలు, గ్రామాలకు రూపొందించిన బృహత్తర ప్రణాళిక–2041 ఆమోదం కోసం ప్రచారం చేయడం జరుగుతోందన్నారు. వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అందించిన వివరాల ప్రకారం 2041 బృహత్తర ప్రణాళికపై పునఃపరిశీలనకు సదరు ప్లాన్ పై అభ్యంతరాలు ఉంటే నిస్సందేహంగా తెలపవచ్చన్నారు. మే 22 నుంచి అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైందని, జూన్ 21 వ తేదీ వరకు ప్రజలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా గానీ పోస్టు ద్వారా తెలియజేయవచ్చన్నారు.