
పనిలో పారదర్శకత, వేగవంతం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలందించేందుకు ‘ఈఆఫీస్‘ విధానాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయం ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం చేపట్టామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన బిల్డింగ్లో ప్రారంభించిన ఈ శిక్షణను ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ప్రభుత్వం డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తూ, కార్యాలయం పరిపాలనలో పారదర్శకతను, వేగవంతంగా సేవలందించేందుకు ‘ఈఆఫీసు‘ విధానాన్ని ప్రారంభించిందన్నారు. ఈ ఆఫీస్ విధానంతో అధికంగా పేపర్లు వినియోగించకుండా, వేగవంతంగా సేవలందించే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నోట్ఫైల్స్, నిర్ణయాలు, అధికారుల మధ్య సమాచార మార్పిడి పూర్తిస్థాయిలో డిజిటల్ రూపంలోనే జరుగుతాయన్నారు. ‘ఈఆఫీసు‘ విధానం పరిపాలనలో వినియోగం వల్ల కార్యాలయం సిబ్బందికి సౌలభ్యంగా ఉండడమే కాకుండా, ఫైల్స్కు భద్రత పెరుగుతుందని తెలిపారు. కావున, పోలీసు కార్యాలయం సిబ్బంది ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని, నిపుణులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని పోలీసు కార్యాలయ ఉద్యోగులకు ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు.
ఎంత పనైనా సులువుగా..
కార్యక్రమంలో ఈ ఆఫీసు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ ఆర్.నరేంద్ర మాట్లాడుతూ ఈఆఫీస్ వినియోగించడం ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పటికీ, భవిష్యత్తులో ఎంత పనినైనా సులువుగా చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రతిరోజూ అరగంట సమయాన్ని ఈఆఫీసు పట్ల అవగాహన కోసం వినియోగిస్తే, సులువుగా నిష్ణాతులు కావచ్చని చెప్పారు. ఈఆఫీసు వినియోగం వల్ల పంపిన ఫైల్స్ ఎవరి వద్ద పెండింగ్లో ఉన్నాయన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చునని నరేంద్ర అన్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సామ్యలత, ఏఓ పి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు వెంకటలక్ష్మి, రామకృష్ణ, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి, పోలీసు కార్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.
పోలీస్ సిబ్బందికి ఈ ఆఫీస్ శిక్షణ
ఎస్పీ వకుల్ జిందల్