
హామీలు నెరవేర్చి.. చేనేత పరిశ్రమను రక్షించండి
ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్
సత్తెనపల్లి: ఎన్నికల హామీలు నెరవేర్చి.. చేనేత పరిశ్రమను రక్షించాలని, కార్మికులను ఆకలి చావుల నుంచి కాపాడాలని కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పిల్లల మర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే చేనేత పరిశ్రమను సంరక్షిస్తామని, ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీలిచ్చాయని చెప్పారు. కానీ ఇప్పటివరకు వాటిని నెరవేర్చలేదని మండిపడ్డారు. వాటిని నెరవేర్చడంతో పాటు చేనేత కార్మికులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు కామర్తి రాజు, కట్టా శివ దుర్గారావు, డోకుపర్తి రామారావు, వాస గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.