
పాఠశాల ప్రాంగణంలో గుడి...!
నూజెండ్ల: భవిష్యత్ తరాలకు ఉపాయోగపడాల్సిన పాఠశాల గ్రామస్తుల పంతాలకు వేదికై ంది. దీంతో అక్కడ చదువుతున్న 35 మంది విద్యార్థుల చదువులు ప్రశ్నార్ధకమయ్యాయి. పాఠశాల ఆవరణలో గుడి నిర్మించాలని ఓ వర్గం నడుం బిగించగా విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుంది వేరే చోట ఏర్పాటు చేయాలని మరో వర్గం వారు నిలవరించటానికి ప్రయత్నిస్తున్నారు. మండలంలోని కొత్త కొత్త పాలెం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చేపడుతున్న గుడి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇందు కోసం గత ప్రభుత్వ హయాంలో పాఠశాల ఆవరణలో చేపట్టిన నాడు నేడు మరుగుదొడ్లను సైతం కూల్చి వేశారు. రాత్రికి రాత్రి స్థలాన్ని చదును చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేశారు. భక్తులకు అందుబాటులో గుడి నిర్మాణం చేపట్టడం ఆనందమే కానీ ప్రశాంత వాతావరణంలో చదువుకోవాల్సిన విద్యార్థులకు ఇబ్బంది కాదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అనుకూలమైన మరో ప్రాంతంలో గుడి ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. అయితే గుడి కట్టాల్సిందే ఎవరు అడ్డు వస్తారో చూస్తామంటూ.. ఎంత వారించినా వినకుండా ఇటువంటి అనైతిక దుశ్చర్యకు కొంత మంది పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి బడి స్థలంలో నిర్మాణాలు అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వివాదంపై ఎంఈఓ రవిచంద్రను వివరణ కోరగా కొంత మంది గ్రామస్తులు ఫిర్యాదు చేశారని సంఘటనా స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
పంతాలకు వేదికగా మారిన కొత్త కొత్తపాలెం ఎస్సీ కాలనీలోని పాఠశాల నాడు – నేడు మరుగుదొడ్లను సైతం కూల్చివేసిన వైనం