
రూ.51 కోట్లతో అభివృద్ధి పనులు
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో సుమారు రూ.51 కోట్లతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ చాంబర్లో జరిగింది. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు ప్రతిపాదించిన 143 అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై సభ్యులు, వివిధ విభాగాధిపతులతో చర్చించి, ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర శివారు, నగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలలో రోడ్లు, డ్రైయిన్లు, వీధి దీపాలు, తాగు నీటి పైపులైన్లు ఏర్పాటు వంటి పనులకు ఆమోదం తెలిపామన్నారు. నాజ్ సెంటర్, స్వామి థియేటర్ వద్ద, అడవితక్కెళ్ళపాడులలోని షాపింగ్ కాంప్లెక్స్లలో లీజు గడువు పూర్తయిన షాపులకు నిబంధనల ప్రకారం రెన్యూవల్ చేయడానికి ఆమోదించామన్నారు. గుంటూరు నగరంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉండటంతో వాటికి శస్త్రచికిత్సలు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా ముగ్గురు పశువుల డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్ సహాయకులను నియమించాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వర రావు, నూకవరపు బాలాజీ, దాసరి లక్ష్మీదుర్గ, ముప్పవరపు భారతి, నగర పాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం పాల్గొన్నారు.
ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీ