
వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గ మండల అధ్యక్షులను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సత్తెనపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులుగా సహారా మౌలాలి, సత్తెనపల్లికి రాయపాటి పురుషోత్తమరావు, ముప్పాళ్లకు నక్కా శ్రీనివాసరావు, రాజుపాలెంకు వేపూరి శ్రీను, నకరికల్లుకు భవనం రాఘవరెడ్డి నియమితులయ్యారు.
● గురజాల నియోజకవర్గంలో గురజాల నగర పంచాయతీ అధ్యక్షులుగా కుక్కముడి అన్నారావు, గురజాల అధ్యక్షులుగా కొమ్మినేని వెంకటేశ్వర్లు, మాచవరం అధ్యక్షులుగా మద్దు ప్రసాదు, పిడుగురాళ్ల రూరల్ మండల అధ్యక్షులుగా చింతా వెంకట సుబ్బారెడ్డి నియమితులయ్యారు.
● రాష్ట్ర విభాగాల కమిటీల్లో
పల్నాడు జిల్లా నాయకులకు చోటు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చిలకలూరిపేటకు చెందిన పాలూరి అంజిరెడ్డిని ఐటీ వింగ్ రాష్ట్ర జోనల్ ప్రెసిడెంట్గా, గురజాలకు చెందిన కర్రా చిన కోటేశ్వరరావును స్టేట్ బూత్ కమిటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా, పెదకూరపాడుకు చెందిన బచ్చు హనుమంత వెంకట సుబ్బారావును స్టేట్ పబ్లిసిటీ వింగ్ సంయుక్త కార్యదర్శిగా నియమించారు.
నాటికల పోటీలు ప్రారంభం
నాదెండ్ల: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. పశువుల ఆసుపత్రి సమీపంలో భారతీయ కళావేదిక వద్ద పోటీలు జరగనున్నట్లు పరిషత్ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీలను జీబీఆర్ హ్యాచరీస్ చైర్మన్ గడ్డం బుచ్చారావు, ఈదర పెద్దబ్బాయి ప్రారంభించారు. తొలిరోజు విశాఖపట్నం కళాభినయ బృందం ఆధ్వర్యంలో ‘ఓ కాశీవాస రావయ్య’ నాటిక ప్రదర్శించారు. రచయితగా పీటీ మాధవ్, దర్శకుడిగా శ్రీకవి ప్రసాద్ వ్యవహరించారు. గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శించారు. రచయితగా ఆకురాతి భాస్కర్చంద్ర, దర్శకుడిగా నడింపల్లి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. సామాజిక దృక్పథానికి అద్దం పట్టేలా రెండు నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పరిషత్ పర్యవేక్షకులుగా జరుగుల రామారావు వ్యవహరించారు.