
పంతం నెగ్గించుకున్న కోడెల వర్గీయులు
నరసరావుపేట: ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించాలనే పంతాన్ని ఆయన వర్గీయులు నెగ్గించుకున్నారు. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా విగ్రహాన్ని కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్విప్ జీవీ ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కోడెల తనయుడు శివరాం పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో కోడెల రాష్ట్రానికి, నియోజకవర్గానికి చేసిన సేవలను కొనియాడారు.
గతంలో ఎమ్మెల్యే అభ్యంతరంతో వివాదం
ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే గతేడాది ఒక అర్ధరాత్రి దిమ్మెను నిర్మించి కోడెల విగ్రహాన్ని నిలబెట్టారు. స్థానిక ఎమ్మెల్యే చేసిన అభ్యంతరాల మేరకు విగ్రహావిష్కరణ ఆగిపోయింది. సుమారు రెండు నెలలపాటు విగ్రహావిష్కరణ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అప్పటి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మంత్రూనాయక్ ఆదేశాలతో సిబ్బంది దిమ్మె పైనుంచి విగ్రహాన్ని తొలగించి సురక్షితంగా హాస్పిటల్ ఆవరణలో ఉంచారు. దీనిపై కోడెల వర్గీయులు ఆందోళన చేసి సూపరింటెండెంట్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. స్థానిక ఎమ్మెల్యే చేసిన సూచనల మేరకే విగ్రహాన్ని తొలగించానని సూపరింటెండెంట్ చెప్పారు. అనంతరం ఆయన తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. చివరకు కోడెల శివరామ్ పట్టుబట్టడంతో విగ్రహావిష్కరణకు నాయకులు పూనుకున్నట్లు తెలియవచ్చింది. అనుమతులు ఎవరు ఇచ్చారనే దానిపై స్పష్టతలేదు.
సొమ్ము ఒకరిది..సోకు మరొకరిది..
2014–19లో కేంద్ర ప్రభుత్వ సంస్థ నాబార్డు అందజేసిన నిధులతో ఆస్పత్రి ఒక భవనాన్ని అసంపూర్తిగా నిర్మించి ఎన్నికలు దగ్గర పడటంతో కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషితో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సందర్శించి సుమారు రూ.3.5కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో ర్యాంపు నిర్మాణం, తాగునీటి వసతి, హాస్పిటల్ చుట్టూ ప్రహరీ, సెప్టిక్ ట్యాంకు, హాస్పిటల్ కావాల్సిన మౌలిక సదుపాయాలన్ని ఏర్పాటుచేసి మళ్లీ పున ప్రారంభించారు. డాక్టర్ గోపిరెడ్డి దాతల సహకారంతో సుమారు రూ.1.5 లక్షల నిధులు సమకూర్చి హాస్పిటల్ను పటిష్టపర్చారు. ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారి రెండు దశల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు, ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు 5వేల మందికి వైద్యసేవలు ఈ వైద్యశాల ద్వారా అందాయి. ఎంతోమంది జీవితాలను నిలబెట్టారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే వెంటనే హాస్పిటల్ పేరును అనధికారికంగా కోడెల పేరు తగిలించి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం.
ప్రభుత్వ హాస్పిటల్లో కోడెల విగ్రహం ఆవిష్కరణ పాల్గొన్న మంత్రి రవి, చీప్విప్ జీవీ, ఎంపీ లావు, ఎమ్మెల్యేలు అనుమతులపై స్పష్టత కరవు