
ఆడుదాం.. ఆరోగ్యంగా ఉందాం
గుంటూరు వెస్ట్ (క్రీడలు ): వేసవి చిన్నారులకు ఎంతో ఇష్టం కారణం పాటశాలలకు సెలవులు. కొన్ని రోజులపాటు పుస్తకాలు, క్లాస్రూమ్స్ ఉండవు. ఆటలు, పాటలే ఆటవిడుపుగా సెలవులను గడిపేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం పట్టణంలో పలు ప్రాంతాల్లో మే 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు వేసవి క్రీడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తుంది. 30 రోజులపాటు సాగే శిక్షణా శిబిరంలో నిపుణులైన శిక్షకులు, సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో క్రికెట్, జిమ్నాస్టిక్స్, చెస్, బాస్కెట్బాల్, టెన్నిస్, కరాటే, జూడో, షటిల్ బాక్సింగ్ ఇలా 23 క్రీడా విభాగాల్లో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసారు. ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, డబుల్ ఒలింపియన్ సత్తెగీత, ప్రస్తుతం ఐపీఎల్లో రాణిస్తున్న ఎందరో క్రీడాకారులు వేసవి శిక్షణా శిబిరాల ద్వారానే వెలుగులోకి వచ్చారు.
బీఆర్ స్టేడియంలో...
స్థానిక బీఆర్ స్టేడియంలో జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, టెన్నిస్, స్కేటింగ్, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, కరాటే, జూడో లాంటి క్రీడల్లో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసారు. వీటిలో టెన్నిస్కు రూ.500, బ్యాడ్మింటన్కు రూ.500, స్కేటింగ్కు రూ.300 వసూలు చేస్తున్నారు. మిగతా అన్ని క్రీడలను ఉచితంగానే శిక్షణనిస్తారు. సమయం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఉంటుంది.
ఎన్టీఆర్ స్టేడియంలో..
అథ్లెటిక్స్ లాంగ్ టెన్నిస్, షటిల్, స్కేటింగ్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, యోగా, చెస్లో శిక్షణ ఉంటుంది. స్విమ్మింగ్కు రూ.2200, అథ్లెటిక్స్కు రూ.1200, బ్యాడ్మింటన్, స్కేటింగ్లకు రూ.1600 చొప్పున ఒక్క నెలకు వసూలు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో శిక్షణనిస్తామని నిర్వహకులు చెబుతున్నారు.
ప్రారంభమైన వేసవి క్రీడా సంబరం మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనలు కిటకిటలాడుతున్న క్రీడా మైదానాలు ఆరోగ్యం కోసం క్రీడలు తప్పనిసరంటున్న నిపుణులు తక్కువ ఖర్చుతోనే నేర్చుకునే సౌలభ్యం
క్రీడలు జీవితంలో తప్పనిసరి
ప్రస్తుత ఆధునిక సమాజంలో చిన్నారులను మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉంచడానికి క్రీడలు తప్పనిసరి. క్రీడా సాధనతో చిన్నారుల కండరాలు, నరాలు గట్టిపడతాయి. చక్కని హోర్మోన్స్ విడుదలకు దోహదపడతాయి. క్రీడా సాధన చేసే పిల్లల భవిష్యత్తు ఆరోగ్యకరంగా ఉంటుంది. షుగర్, బీపీ, ఒత్తిడి దరిచేరవు. శారీరక శ్రమ లేకపోవడంతోనే బాల్యంలోనే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తితోపాటు చక్కని ఆరోగ్యం ఇచ్చేందుకు ప్రయత్నించాలి.
– డాక్టర్ కె.సుబ్బారావు,
ఎండో క్రైనాలజిస్ట్
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
దాదాపు 2500 మంది చిన్నారులను 50 బ్యాచ్లుగా విడగొట్టి వారికి కావాల్సిన వాటిలో శిక్షణనిస్తున్నాం. కొన్ని క్రీడలకు నామమాత్రపు రుసుము వసూలు చేయగా మరికొన్ని ఉచితంగా అందిస్తున్నాం. శిక్షణా శిబిరాల్లో ప్రతిభ కనబరచే వారిని ఎంపిక చేసి ప్రొఫెషనల్ స్థాయికి వచ్చే విధంగా తర్ఫీదునిస్తాం. చిన్నారుల ఆరోగ్య స్థితిగతుల బట్టి వారికి ఇష్టమైన క్రీడలోనే చేర్చాలి. పిల్లల శిక్షణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. శాప్ కూడా ప్రతి క్రీడ నిర్వహణకు రూ.7000 చొప్పున కేటాయించింది. ఎంతమంది పిల్లలు వచ్చినా శిక్షణనిస్తాం.
– నరసింహారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి

ఆడుదాం.. ఆరోగ్యంగా ఉందాం

ఆడుదాం.. ఆరోగ్యంగా ఉందాం

ఆడుదాం.. ఆరోగ్యంగా ఉందాం