
పస్తులతో చస్తున్నా.. పట్టించుకోరా..!
వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
నరసరావుపేట: రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తూ ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అన్నారు. సంఘం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం కలెక్టరేట్ వద్ద సామూహిక రాయబారం, ధర్నా నిర్వహించారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో సుదీర్ఘకాలంగా 20వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వేతనాలు పెరుగుతాయని, పదోన్నతులు అమలు చేస్తారని ఆశించి భంగపడ్డామన్నారు. వీఆర్ఏలకు నిబంధనలకు విరుద్ధంగా నైట్ వాచ్మెన్, అటెండర్ డ్యూటీలు వేస్తున్నారన్నారు. రీసర్వే పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుందని టీఏ, డీఏ అమలు చేయడం లేదన్నారు. అదనపు పని భారానికి ఆర్థిక సమస్యలు కూడా తోడుకావటంతో వీఆర్ఏల కుటుంబాలు పస్తులతో గడపాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ వీఆర్ఏలకు గత ఎనిమిదేళ్ల నుంచి వేతనాలు పెరగలేదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బందగీ సాహెబ్ మాట్లాడుతూ వాచ్మెన్లు, అటెండర్లు ఎక్కడైతే అవసరమో అక్కడ సీనియారిటీ ఉన్న వీఆర్ఏలను శాశ్వత ప్రాతిపదికన నియమించాలన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఏఓ శివలీలకు వినతిపత్రం సమర్పించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందరాజు, సత్తెనపల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, నరసరావుపేట డివిజన్ అధ్యక్షులు ఆనంద్ కుమార్, సిలార్ మసూద్, అధిక సంఖ్యలో గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.