
ఎన్జీ రంగా అగ్రి వర్సిటీ వజ్రోత్సవాలు ప్రారంభం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటై 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న వజ్రోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. గుంటూరు శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని వర్సిటీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వజ్రోత్సవ ఫైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ఎన్జీరంగా విగ్రహావిష్కరణ చేశారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్సిటీ రైతుల కోసం మరిన్ని వంగడాలను తయారు చేయాలని సూచించారు. ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి సాంకేతిక సదస్సును ప్రారంభించి విశ్వవిద్యాలయ ప్రగతిని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రొఫెసర్ విజయ్పాల్శర్మ, రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాస్ నూతన వంగడాలు, పరిశోధనలపై చర్చించారు. సాంకేతిక నిపుణులు పలు అంశాలపై ప్రసంగించారు. మాజీ ఉపకులపతి డాక్టర్ పి.రాఘవరెడ్డి మాట్లాడుతూ 1964 నుంచి నేటి వరకూ విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధి, కృషిని అభినందించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు, పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవి సత్యనారాయణ, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి. శివన్నారాయణ అతిథులను శాలువాలతో సత్కరించారు. విశ్వవిద్యాలయం 60 ఏళ్ళలో సాధించిన ప్రగతికి నిదర్శనంగా ఏర్పాటు చేసిన 150 పరిశోధన, వంగడాలు, ఇతర స్టాళ్లు రైతులు, సందర్శకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే బి.రామాంజనేయులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మాజీ చైర్మన్ చింతల గోవిందరాజులు, పి.జె.పి.ఎస్.ఏ.యూ వైస్చాన్సలర్ జానయ్య, పశువైద్య విశ్వవిద్యాలయం వీసీ జె.వి.రమణ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.గోపాల్, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ టి.సుగుణ, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మాజీ వీసీ డాక్టర్ దామోదర్ నాయుడు,రైతులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాలక మండలి సభ్యులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.