
క్షతగాత్రులకు సత్వర సాయం
స్థానికులు, పోలీసులకు జిల్లా ఎస్పీ అభినందనలు
నరసరావుపేట: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన సంఘటనలో గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించిన పోలీసులను జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అభినందించారు. శనివారం తెల్లవారుజామున శ్రీలక్ష్మీ గాయత్రి ట్రావెల్ బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాదు నుంచి చీరాలకు వెళుతూ మార్గమధ్యలో నకరికల్లు మండలం శాంతినగర్ గ్రామంలోని పెట్రోల్ బంకు ఎదురుగా చేరుకునేసరికి బస్సు డ్రైవరుకు నిద్రమత్తు ఆవరించి బస్సు రోడ్డు పక్కన ఉన్న మార్జిన్లో పక్కకు పడిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, స్థానికులు బస్సు లోపల వారందరినీ బయటకు తీశారు. ఈ సంఘటనలో 15 మందికిపైగా గాయాలు కావటంతో వారిని చికిత్స నిమిత్తం అంబులెన్సుల ద్వారా పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు చేర్చారు. ఈసంఘటనలో ఓ మహిళ బస్లోపల కింది భాగంలో ఇరుక్కుని పోగా, పొక్లయిన్, క్రేన్ల సహాయంతో బయటకు తీసి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు పంపించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, డీఎస్పీ కె.నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్ లోపల క్షతగాత్రులను రక్షించి హాస్పిటల్కు పంపినందుకు స్థానికులు, పోలీసులకు ప్రత్యేకంగా ఽఅభినందించారు. నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ కిషోర్, నకిరికల్లు ఎస్ఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందజేశారు.