
17 కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి ముంబైకి 17.45 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా నిలంద్రిచంద్రపూర్ గ్రామానికి చెందిన చాబి సాహును శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నమనాయుడు తెలిపారు. ముందస్తు ఒప్పందం మేరకు శుక్రవారం 17.45 కిలోల గంజాయిని ఎనిమిది ప్యాకెట్లు రెండు బ్యాగులలో సిద్ధం చేసి ఒడిశా నుంచి ఇచ్ఛాపురం తీసుకురాగా. రైల్వేస్టేసన్ వద్ద పట్టణ పోలీసులు తనిఖీలలో గర్తించి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. తనిఖీలలో పట్టణ ఎస్ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఐటీఐ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగించారు. 284 మందికి గాను 128 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 83 మంది వివిధ కళాశాలల్లో సీట్లు పొందారని జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు తెలిపారు. శనివారం 563 నుంచి 858వ ర్యాంకు వరకూ కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కె.సుధ పర్యవేక్షిస్తున్నారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే సలహా మండలి బోర్డు సభ్యుడిగా రాజేష్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఈస్ట్కోస్ట్ రైల్వే డివిజన్ సంప్రదింపుల సలహా మండలి సభ్యుడిగా ప్రముఖ విద్యా వేత్త, బీసీ నేత ప్రొఫెసర్ డాక్టర్ బుడుమూరు రాజేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, కొత్తగా రైళ్ల ప్రతిపాదన, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో సూచనలను ఈ నెల 24న జరిగే సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. రాజేష్ ప్రస్తుతం జేఎన్టీయూ పాలక మండలి సభ్యుడిగా, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.
అంబులెన్సులో ప్రసవం
మందస: టిక్కరి గ్రామానికి చెందిన నిండు గర్భిణి పుష్ప పాయకో పురిటినొప్పులతో బాధపడటంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే మందస 108 అంబులెన్సు ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్ ఎం.రామచంద్రారెడ్డిలు గ్రామానికి చేరుకున్నారు. అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే ప్రసవం చేయించింది. పుష్ప మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలను హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
సచివాలయంలో చోరీ
పలాస: టెక్కలిపట్నం గ్రామ సచివాలయంలో రెండు కంప్యూటర్ మానిటర్లు చోరీకి గురయ్యాయి. గురువారం రాత్రి కార్యాలయానికి తాళం వేసి శుక్రవారం ఉదయం చూసే సరికి మానిటర్లు కనిపించకపోవడంతో పంచాయతీ కార్యదర్శి రవి కాశీబుగ్గ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సూర్యనారాయణ చెప్పారు. కాగా, వేసిన తాళం వేసినట్టుగానే ఉందని, ఇందులో కార్యాలయం సిబ్బంది హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
9న అప్రెంటిస్ మేళా
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 9న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు బయోడేటా, ధ్రువపత్రాలతో హాజరుకావాలని కోరారు. నాగార్జున అగ్రికమ్, శ్యాంపిస్టన్స్, అరబిందో, ఎస్ఆర్ఎంటీ, అపోలోటైర్స్ తదితర కంపెనీల్లో అప్రెంటిస్ కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

17 కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు

17 కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు

17 కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు