
మురుగు నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి
భువనేశ్వర్: వర్షాలకు ముందు పట్టణ ప్రాంతాల సన్నద్ధత గురించి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి విభాగం మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్రో పట్టణ ప్రాంతాలకు చెందిన వివిధ అధికారులతో మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. వానా కాలంలో కృత్రిమ వరద పరిస్థితిని ప్రేరేపిస్తున్న నీటి ప్రవాహ అడ్డంకి పరిస్థితుల నివారణ కోసం ఈ సమావేశం నిర్వహించడం విశేషం. వాన, మురికి నీరు ప్రవాహ వ్యవస్థ పరిస్థితిని పరిశీలించి, అడ్డంకులు మరియు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రవాహ అడ్డంకితో ముంపునకు గురి అవుతున్న ప్రాంతాలను గుర్తించి సత్వర కార్యాచరణతో సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. బకాయి ఉన్న హోల్డింగ్ పన్ను వసూలు చేయడంపై యంత్రాంగం శ్రద్ధ వహించాలన్నారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
డ్రైనేజీ వ్యవస్థపై సమీక్ష
నగర, పట్టణ ప్రాంతాల్లో వర్షాకాలంలో తలెత్తే కృత్రిమ వరద పరిస్థితి ప్రాంతీయుల దైనందిన జీవన శైలికి అంతరాయం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ సందర్భంగా నగరంలో డ్రైనేజీ వ్యవస్థని మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభావిత ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ వాస్తవ స్థితిగతుల్ని ప్రత్యక్షంగా సమీక్షించారు. కృత్రిమ వరద పరిస్థితి పునరావృతం కాకుండా స్థిరమైన డ్రైనేజీ పరిష్కారాలను అన్వేషణ అనివార్యమని మంత్రి అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో ఈ నిరంతర పట్టణ, నగర సవాళ్లను పరిష్కరించడానికి గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి విభాగం మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్రో మంగళవారం నగరంలోని అనేక కీలక ప్రదేశాలపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్, బీఎంసీ ఇంజినీర్, స్థానిక ఎమ్మెల్యే బాబూ సింగ్ మరియు అనేక మంది కార్పొరేటర్లతో కలిసి మంత్రి సంయుక్తంగా తనిఖీ చేసి, తక్షణ మరియు దీర్ఘకాలిక పరిష్కార చర్యలపై చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ దార్శనికతకు అనుగుణంగా వర్షపు నీటి ప్రవాహ నీటి నిర్వహణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందన్నారు. నీటి ప్రవాహ మార్గం మూసుకుపోవడంతో ఈ పరిస్థితులు తాండవిస్తున్నట్లు గుర్తించారు. ఈ సమస్య నివారణకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేయా లని యోచిస్తున్నారు. 10వ నంబర్ డ్రెయిన్లోకి వర్షం, వినియోగించిన నీటిని విడుదల చేయడానికి ప్రయత్నించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ నుంచి వాణి విహార్ వరకు ప్రత్యేక మురుగు నీరు ప్రవాహ వ్యవస్థ ఏర్పాటు అవుతుందన్నారు. ప్రస్తుతం తాత్కాలిక సర్దుబాటుతో కాలక్షేపం చేయడం సోపానంగా భావిస్తున్నారు.
మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహాపాత్రో