భువనేశ్వర్: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వ్యూహాత్మక దాడిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ (ఐఆర్ఎస్)ని అరెస్టు చేసింది. చింతన్ రఘువంశీ తొలి వాయిదా కింద రూ. 20 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అవినీతి ఆరోపణల ఫిర్యాదు మేరకు వ్యూహాత్మకంగా అతన్ని పట్టుకుపన్నట్లు వివరించారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసును పరిష్కరించడానికి కుదిరిన రూ. 5 కోట్లు లంచం వ్యవహారంలో తొలి విడత కింద చెల్లింపు జరుగుతుండగా సీబీఐ వ్యూహాత్మకంగా అక్కడికక్కడే నిర్బంధంలోకి తీసుకుంది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ సోదరుడు ఈ వ్యవహారానిక రాయబారిగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయంపై సీబీఐ తదుపరి దర్యాప్తు ప్రారంభించింది.
సమలాయి దుర్గా పండుగ ప్రారంభం
రాయగడ: స్థానిక పాయికోవీధిలోని సమలాయి దుర్గా వార్షిక పండుగ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది. సాయంత్రం పాయికోవీధి నుంచి మజ్జిగౌరి మందిరం పాదాల గుడి వరకు ఊరేగింపుగా వెళ్లిన భక్తులు అమ్మవారి పాదాలను తీసుకువచ్చి సమలాయి దుర్గ మందిరంలో నిలపడంతో పండుగకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజులు జరిగే పండుగ జూన్ మూడో తేదీతో ముగుస్తుంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు.
కటక్లో తొలి కోవిడ్ రోగి గుర్తింపు
భువనేశ్వర్: కటక్ జిల్లాలో తొలి కోవిడ్ – 19 కేసు నమోదు అయింది. జిల్లా ప్రధాన వైద్య అధికారి సీడీఎంఓ ప్రశాంత్ హత్తా ఈ విషయాన్ని నిర్ధారించారు. పీడితుడు స్థానిక 44 ఏళ్ల వ్యక్తిగా పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ నిర్బంధంలో కోవిడ్ సంబంధిత జాగ్రత్తలతో పరిశీలనలో ఉన్నాడు. దీనికి ముందు అతనికి ప్రయాణ చరిత్ర లేదని తెలిపారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోవడంతో కోవిడ్ – 19 సోకినట్లు ఖరారైంది.

ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ అరెస్టు