
ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
పర్లాకిమిడి: ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అన్నారు. స్థానిక గజపతి కలెక్టరేట్లో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగినది. పదేళ్లు పైబడిన ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దాస్ అన్నారు. 0 – 5 ఏళ్ల వయస్సు బాలబాలికలు కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని అన్నారు. దీని కోసం ఆధార్ కేంద్రాలను బ్యాంకులు, పోస్టాఫీసులు, బ్లాక్ కార్యాలయాలు, ఎన్.ఏ.సి.లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకు అక్కౌంటుకు లింక్ చేసుకోవాలని అన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అనేక ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు విద్యాభృతి, రేషన్ కార్డు, సుభద్ర వంటి తదితర పథకాలు వర్తిస్తాయన్నారు. ఆధార్ అప్డేట్ తప్పనిసరి అన్నారు.
అధికారులు పంచాయతీ స్థాయి నుంచి మున్సిపల్, ఎన్ఏసీల వరకూ చైతన్య ర్యాలీలు నిర్వహించాలని కోరారు. జిల్లా ముఖ్యవైద్యాధికారి మహామ్మద్ ముబారక్ ఆలీ, మహిళా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, జిల్లా సామాజిక సురక్షా అధికారి సంతోష్ కుమార్ నాయక్, లీడ్ బ్యాంకు మ్యానేజరు మహేశ్వర్ మండళ్, చిరంజీవి దొర పాల్గొన్నారు.