
● అధ్వానంగా రహదారి
రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరానికి రైల్వే బ్రిడ్జి కింద నుంచి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. దీంతో మందిరం కమిటీ సభ్యులు మందిరం తరపున మందిరం నుంచి రైల్వేస్టేషన్కు ఉచితంగా సేవలు అందిస్తున్న బస్ను నిలిపివేశారు. సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు ఉన్న మట్టిరోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రహదారి మొత్తం గుంతలమయమయ్యింది. అయితే ప్రతీ ఆది, మంగళ, బుధవారాల్లో పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర నుంచి వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. దీనిలో అత్యధిక శాతం మంది సొంత వాహనాలు, మరికొందరు అద్దెకు తీసుకొచ్చే వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. మందిరానికి వచ్చే ప్రధాన రహదారి ఇదే కావడంతో వాహనాలు లోపలకు వచ్చే సమయంలో ఇక్కడ ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయోననే భయాందోళనల మధ్య వాహనాలు నడుపుతున్నారు. కాగా గత కొద్దిరోజులుగా ఉన్న మట్టిరోడ్డు పూర్తిగా పాడవ్వడంతో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వాహనాల పార్కింగ్ కోసం భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా పార్కింగ్ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సమీపంలోని మూడో రైల్వేలైన్, అదేవిధంగా జంఝావతి నది వద్ద కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ రహదారి మరీ అధ్వానంగా మారింది. భారీ వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో రహదారి పూర్తిగా పాడైంది. అందువలన ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకముందే రహదారి మరమ్మతులు చేయాలని భక్తులు కోరుతున్నారు.