
బైపాస్ నిర్మాణానికి మంజూరు కాని నిధులు
● పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య
పర్లాకిమిడి: జిల్లా కేంద్రం పర్లాకిమిడికి బైపాస్ రోడ్డు లేక పోవడంతో ప్రజలు అనేక ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కుంటున్నారు. రెండు రోజుల క్రితం పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణి గ్రాహి రోడ్లు–భవనాల శాఖ ముఖ్యకార్యదర్శిని కలిసి బైపాస్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అప్పటి కలెక్టర్ లింగరాజ్ పండా సమయంలో బైపాస్ రోడ్డుకు సర్వే జరిపి రోడ్లు–భవనాలశాఖ అంచనాలు రూపొందించారు. సుమారు నాలుగు కిలో మీటర్ల దూరం ఉన్న బైపాస్ రోడ్డు జాజిపురం నుంచి బెత్తగుడ మీదుగా గుమ్మరోడ్డుకు కలపడానికి ఇంజినీర్లు ప్లాన్లు రూపొందించారు. 40 కోట్ల రూపాయలతో అప్పట్లో డీపీఆర్ అంచానాలు రూపొందించారు. కానీ ఇంతవరకూ రాష్ట్ర ప్రభు త్వం నిధులు మంజూరు కాకపోవడం వల్ల టెండర్లు పిలువలేదని రోడ్లు–భవనాల శాఖ, సూపరింటెండింగ్ ఇంజినీరు అభిషేక్ శెఠి తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రంలో మారిన తరువాత జిల్లాకు కొత్త రోడ్లు మంజూరు కాలేదు. అర్ధశతాబ్దకాలం అంచానాలు రూపొందించిన తుంబ– కోయిపూర్– మహేంద్రగిరి– బరంపురం (గంజాం)రోడ్డు పూర్తి కాగలిగింది కానీ, బైపాస్ రోడ్డు ఇంతవరకూ ప్రభుత్వం ఆమోదించలేకపోవడం పట్ల ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రా హి విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలియజేశారు.