
పసుపు సాగులో మెలకువలు
బాల్కొండ: ఖరీప్ సీజన్లో పసుపు సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ముందస్తు వర్షాలతో కొందరు రైతులు పసుపు విత్తడం ప్రారంభించారు. జిల్లాలో సుమారు 33 వేల ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేస్తారు. పసుపు సాగులో మె లకువలను పాటించాలని ఆర్మూర్ డివిజన్ ఉద్యానవన అధికారి రుద్ర వినయ్ రైతులకు పలు సూచ నలు, సలహాలు చేస్తున్నారు. ఆయన మాటల్లోనే..
నేల తయారీ..
నేలను బాగా లోతుగా దున్నాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 40 ట్రాక్టర్ల నల్లమట్టిని నేలలో వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను వాడాలి. అడుగు మందుగా ఎకరానికి ఆరు బస్తాల సింగిల్ సూపర్ పాస్పెట్ చల్లాలి.
బెడ్ విధానంలో ఇలా..
బెడ్ పద్ధతిలో విత్తినట్లయితే విత్తే రోజు బెడ్ మీద, బెడ్ మధ్యలో 45 సెంటీ మీటర్ల ఎడం ఉండేట్లు రెండు లైన్లు , రెండు అంగుళాల లోతు ఉండేట్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ మీద ఎకరానికి మూడు సంచుల వేప పిండి, ఒక్క బస్తా యూరియా, ఒక్క బస్తా పొటాష్ కలిపి లైన్లలో వేయాలి. బెడ్పై లైన్లలో విత్తన ముక్కల్ని సుమారుగా 22.5 సెంటీమీటర్లు (9 అంగుళాలు) దూరం ఉండేట్లు విత్తి బాగా కప్పేయాలి. డ్రిప్పు పైపులు పరిచి నీరు బాగా అందేట్లుగా వదలాలి.
కలుపు నివారణ
విత్తనం వేసిన మరుసటి రోజు ఎకరానికి కిలో చొప్పున అట్రాజిన్ కలుపు మందును 200 లీటర్ల నీటితో పిచికారీ చేయాలి. విత్తనం వేసిన 21 రోజులకు మొలక వస్తుంది. ఎక్కడైనా గ్యాపులు వస్తే ముందే ట్రేలలో పెంచిన మొక్కలను వాడాలి.
విత్తనం ఆదా.. విత్తన శుద్ధి ఇలా
కొత్త పద్ధతిలో భాగంగా విత్తన కొమ్మును చిన్నచిన్న ముక్కలు చేయడం ద్వారా విత్తన ఆదా చేసుకోవాలి. విత్తనాన్ని ఒక్క అంగుళం ఉండేట్లు ముక్కలు చేయాలి. దీంతో ఎకరానికి రెండు క్వింటాళ్ల విత్తనం మాత్రమే సరిపోతుంది. విత్తన ముక్కల్ని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున రిడోమిల్ గోల్డ్ కలిపి తయారు చేసిన మంచు ద్రావణంలో అరగంట సేపు నానబెట్టి శుద్ధి చేసి ఆరబెట్టాలి. విత్తన శుద్ధి రెండు, మూడు రోజుల ముందు చేసుకోవాలి. దీంతో విత్తనం వేసే రోజు హడావుడి ఉండదు. పొలుసు, పురుగు ఉన్న చోట విత్తన శుద్ధి చేసేటప్పుడు లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్ కలపాలి.