
చికిత్స పొందుతూ ఒకరి మృతి
సదాశివనగర్: మండల కేంద్రంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కుర్మ గంగమల్లు(39) నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి తిరిగొచ్చాడు. తనకున్న ఎకరం 30 గుంటల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన భూమిని ప్రైవేట్ సర్వేయర్తో సర్వే చేయించగా మూడు గుంటల భూమి తక్కువ వచ్చింది. దీంతో మనస్తాపం చెందిన గంగమల్లు మంగళవారం బావి వద్ద గడ్డిమందును సేవించి, ఫోన్లో సమాచారం ఇచ్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న గంగమల్లును మొదట కామారెడ్డి ఆస్పత్రికి, తర్వాత ఎల్లారెడ్డిపేట్ అశ్విని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన సీతాపవర్ అమరనాథ్ కుటుంబసభ్యులతో కలిసి గత నెల 31న హైదరాబాద్కు వెళ్లారు. బుధవారం తిరిగి ఇంటికి వచ్చి చూస్తే తాళం పగులగొట్టి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 12 గ్రాముల బంగారం, రూ.11 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
ముగ్గురిపై కేసు నమోదు
నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం సిర్పూర్ శివారులో ఉన్న బాలయోగి అవధూత నిర్మలానంద స్వామి ఆశ్రమంలోని కుటీరం దగ్ధంపై ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ బుధవారం పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.