
మహిళ హత్య కేసు ఛేదన
బాల్కొండ: నందిపేట్ మండలం అయిలాపూర్ శివారులో గత నెల 26న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాల్కొండ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి వివరాలు వెల్లడించారు. నందిపేట్ మండలం శాపూర్కు చెందిన సాద సుమలత(42) గత నెల 26న కూరగాయల కోసం మండల కేంద్రంలో నిర్వహించే సంతకు వచ్చింది. మార్కెట్లో ఆలూర్ మండల కేంద్రానికి చెందిన వేల్పుల పెద్ద గంగాధర్తో పరిచయం ఏర్పడింది. సుమలతను అయిలాపూర్ శివారులోని వంతెన వద్దకు తీసుకెళ్లిన గంగాధర్.. అత్యాచారానికి యత్నించాడు. సుమలత విభేదించడంతో చీర కొంగుతో గొంతు నులిమి హత్య చేశాడు. 27న సుమలత శవమై కనిపించడంతో కొడుకు సాద సంజీవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించారు. మంగళవారం మధ్యాహ్నం నిందితుడు గంగాధర్ ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో బాల్కొండ మండలం చిట్టాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టినట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించిన నందిపేట్ ఎస్సై చిరంజీవి, సిబ్బందిని సీఐ అభినందించారు. కాగా, గంగాధర్పై గతంలో మాక్లూర్ పోలీస్స్టేషన్లో హత్యకేసుతోపాటు దొంగతనం కేసు కూడా నమోదైంది.