
యువతకు నైపుణ్యమస్తు..
బోధన్: యువత, విద్యార్థులకు స్కిల్ కోర్సులు అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు బోధన్ పట్టణ శివారులోని మైనార్టీ ఐటీఐ ప్రాంగణంలో ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) సిద్ధమవుతోంది. మరో వారంలో కేంద్రానికి వచ్చిన ఆధునిక సాంకేతిక పరికరాల బిగింపు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి స్థానిక మైనార్టీ ఐటీఐలో ఉన్న ట్రేడ్ కోర్సులతోపాటు ఏటీసీలో అత్యాధునిక కొత్త కోర్సుల్లో ప్రవేశానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ఉంటుంది. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సౌజన్యంతో అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో తరగతుల నిర్వహణ, ప్రయోగాత్మక బోధనకు వీలుగా తీర్చిదిద్దనున్నారు. దీంతో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవంతో నైపుణ్యాలను మెరుగుపర్చనున్నారు.
ఆరు కొత్త కోర్సులు ..172 సీట్లు
ఏటీసీకి ఆరు అత్యాధునిక సాంకేతిక కోర్సులు మంజూరయ్యాయి. ఏడాది వ్యవధి కోర్సులైన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమెషిన్లో 40 సీట్లు, ఇండస్ట్రీయల్ రొబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్లో 40, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ (సెక్టార్ క్యాపిటల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్)లో 20 సీట్లు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధి కోర్సులైన బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫయర్ మెకానికల్లో 24 సీట్లు, అడ్వాన్స్డ్ సీఎన్సీ మ్యాచినింగ్ టెక్నీషియన్లో 24, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్ కోర్సులో 24 సీట్లు ఉన్నాయి.
ఆసక్తి గల విద్యార్థులు ప్రవేశ దరఖాస్తుకు ఎస్ఎస్సీ మెమో, కుల ధృవీకరణ పత్రం, టీసీ, బోనాఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు జత చేయాల్సి ఉంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని, అనంతరం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శాంతారాం తెలిపారు. మిగతా వివరాలకు 94925 80776, 90592 10915 నంబర్లకు సంప్రదించాలని ఆయన సూచించారు.
బోధన్లో పూర్తి కావొస్తున్న ఏటీసీ
త్వరలోనే కొత్త కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్