
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన బొంత నందిని(16) కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని మత్తడికింది పల్లెకు చెందిన నందిని తరచూ ఫోన్ చూస్తోందని తల్లిదండ్రులు శెణవ్వ, పోచయ్య మందలించారు. దీంతో మనస్తాపం చెందిన నందిని ఆదివారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి తలుపులకు గొళ్లెం పెట్టి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు లేచి చూడగా బయట నుంచి తలుపులకు గొళ్లెం పెట్టి ఉంది. నందిని కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం లింగంపేటలోని చీరపేండ్ల కుంటలో నందిని మృతదేహం లభించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తండ్రి మందలించాడని..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని సీతాయిపల్లి గ్రామానికి చెందిన మొగుళ్ల అనిల్ కుమార్(24) మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అనిల్కుమార్ మద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా జులాయిగా తిరిగేవాడు. ఏదైనా పని చేయాలని తండ్రి సాయిలు ఆదివారం మందలించడంతో రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా సోమవారం మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.