
సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు సుబ్బారావు మృతి
మాక్లూర్: రాష్ట్ర, జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మైనేని సుబ్బారావు (59) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన పుట్టి పెరిగింది కొత్తపల్లి గ్రామంలోనే. జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆ క్రమంలోనే కబడ్డీ కోచ్గా నగరంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో కొనసాగుతూ వచ్చారు. ఈయన మృతిపై ఆయా క్రీడా కోచులు సంతాపం తెలిపారు. అంత్యక్రియలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు.
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
డిచ్పల్లి: మండలంలోని బర్ధిపూర్ శివారు మాధవనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (45) ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై హెచ్ సాయిరెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మాధవనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. శనివారం రాత్రి నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ హరికృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్కు సమాచారం అందించాలని రైల్వే ఎస్సై సాయిరెడ్డి కోరారు.