
బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం
నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కృషి చేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. 2017కు ముందున్న వారికి డివిజన్ స్థాయి అధ్యక్ష పదవులు ఇవ్వాలని అధిష్టానం సూచించిందన్నారు. పాత, కొత్త తేడా లేకుండా అందరూ పార్టీ కోసం పనిచేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిజామాబాద్ అర్బన్కు 3500 కేటాయించగా, అందులో కేవలం 752 మాత్రమే అర్హులుగా నిలవడం బాధాకరమని అన్నారు. నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా స్థానిక నాయకులు చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను ఇందిరమ్మ కమిటీ నాయకులతోనే పంపిణీ చేస్తామని తెలిపారు. రూ. 50 వేలు, రూ. లక్ష రాజీవ్ యువ వికాస్ రుణాల కోసం బ్యాంక్ సిబిల్ అవసరం లేదన్నారు. అర్హులైన వారికి రుణాలు అందిస్తామన్నారు. ఇదివరకు రూ. లక్షకు పైగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు రుణ పరిమితి, రూ. 50 వేలు, రూ. లక్షకు మార్చుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు తిరుపతి మాట్లాడుతూ.. డివిజన్ అధ్యక్షుల కోసం ఆయా డివిజన్ నాయకులు ఏకగ్రీవంగా ఒకరి పేరు సూచిస్తూ జాబితాను పార్టీ నగర అధ్యక్షుడు కేశ వేణుకు ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, నగర అధ్యక్షుడు నుడా చైర్మన్ కేశ వేణు, నరాల రత్నాకర్, విపుల్గౌడ్, బొబ్బిలి రామకృష్ణ, జావెద్ అక్రమ్, రాంభూపాల్, సంతోష్, నరేందర్ గౌడ్, సయ్యద్ ఖైసర్, నరేందర్సింగ్, రేవతి, పోల ఉష తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
మహ్మద్ షబ్బీర్ అలీ
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
పాతవారికే డివిజన్ అధ్యక్ష పదవులు