
అత్యవసర సేవలకు ‘శానిటరీ స్పెషల్టీం’
నిజామాబాద్ సిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యవసర పనుల కోసం శానిటరీ విభాగానికి చెందిన పది మంది సిబ్బందితో స్పెషల్ టీంను అధికారులు ఏర్పాటు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున అర్ధరాత్రి వేళ అత్యవసర సేవలకు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచినా, చెట్లు విరిగిపడినా, ఇతర అత్యవసర సేవలకు బల్దియా అధికారులు పది మందితో కూడిన పారిశుధ్య కార్మికుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు ప్రతి రోజు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వహించనున్నారు. వర్షంలో సైతం పనిచేసేందుకు వీరికి రెయిన్కోట్స్, చేతులకు గ్లౌవుస్, తలకు హెల్మెట్స్, రాత్రివేళల్లో కనిపించేందుకు ఆఫ్రాన్స్, ఇతర పరికరాలను అందించారు. వర్షాకాలం వరకు ఈ స్పెషల్ టీం ప్రతిరోజు డ్యూటీలో ఉంటుంది. ఈ బృందానికి జవాన్ ప్రేమ్కుమార్ను సైతం కేటాయించారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ ఆదేశాలతో ఈ స్పెషల్ టీంను సిద్ధంగా ఉంచినట్లు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్ తెలిపారు.

అత్యవసర సేవలకు ‘శానిటరీ స్పెషల్టీం’