
వార్డ్ ఆఫీసర్లకు షోకాజ్ షాక్
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న 60 మంది వార్డు ఆఫీసర్లకు ఉన్నతాధికారులు ఒకేసారి షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశ మైంది. ఏశాఖలోనైనా సాధారణంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే, క్రమశిక్షణ తప్పే ఒకరిద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంటారు. కానీ ఇక్కడ మా త్రం ఒకేసారి 60 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
కారణమిదేనా..?
వార్డు ఆఫీసర్లు రెవెన్యూ పనులు సైతం చేస్తున్నారు. ఆస్తి పన్ను బకాయిదారులకు డిమాండ్ నోటీసులు ఇవ్వడంతోపాటు భువన్ సర్వే, డబుల్ అసెస్మెంట్లు గుర్తింపు, శిథిలావస్థలోని నిర్మాణాలు, కూల్చివేసిన నిర్మాణాలు, అసెస్మెంట్లో ఉన్న నిర్మాణాలు, అసెస్మెంట్ లేనివాటి వివరాలు క్షేత్రస్థాయిలో సేకరించాలి. వీరిలో కొంతమంది తాము సేకరించిన వివరాలు యాప్లో నమోదు చేయడంలో కాస్త వెనుకబడ్డారు. మరి కొంతమంది తాము సేకరించిన వివరాలు పైస్థాయి సిబ్బందికి అందించగా వారు వివరాలు నమోదుచేయలేదు.
ఆర్వో అల్టిమేటం!
రెవెన్యూ ఆఫీసర్ ఖదీర్ పాషా 60 మంది వార్డు ఆఫీసర్లకు ఈనెల 27న ఒకేసారి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సరైన వివరణ ఇవ్వకపోతే చార్జిమెమో జారీచేస్తామని, మున్సిపల్ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసు ల్లో పేర్కొన్నారు. దీంతో తమ సమస్యలను కమిషనర్తో చెప్పుకుంటామని వార్డు ఆఫీసర్లు కోరినా ఆర్వో అంగీకరించలేదు. ఆలస్యం చేస్తే చార్జి మె మో జారీచేస్తానని ఆర్వో అల్టిమేటం ఇచ్చారని వార్డు ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆవేదన పట్టేదెవరికి?
కార్పొరేషన్లో వార్డు ఆఫీసర్లకు అన్ని పనులు అ ప్పగిస్తున్నారు. ప్రభుత్వ సర్వేలు, కులగణనతో పాటు పన్ను వసూళ్లలో సైతం వీరి పాత్ర కీలకమైంది. వీటితోపాటు తాజాగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే, రా జీవ్ యువ వికాసం రుణాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, దరఖాస్తుదారుల వివరాలు ‘ఇందిరమ్మ ఇండ్లు’ యాప్లో నమోదు. తర్వాత డివిజన్వారీగా సర్వేచేశారు. మళ్లీ రెండోదఫా రీసర్వేలు కూడా చేశారు. ఇంత చేస్తున్నా తమ ఆవేదన ఎవరికీ పట్టడం లేదని వార్డుఆఫీసర్లు వాపోతున్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం
60 మందికి నోటీసులు
24 గంటల్లో సంజాయిషీ
ఇవ్వాలని ఆదేశం
పనులు చేసినా ఏకపక్షంగా నోటీసులు జారీ చేశారంటున్న వార్డు ఆఫీసర్లు