
రైతుల చెంతకే రెవెన్యూ సదస్సులు
● కలెక్టర్ అభిలాష అభినవ్
లక్ష్మణచాంద/నిర్మల్ రూరల్: రైతుల భూసమస్యలు పరిష్కరించడానికి రైతుల చెంతకే రెవెన్యూ అధికారులు వస్తారని సదస్సులు ఏర్పాటు చేస్తారని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మండలంలోని కనకాపూర్లో, నిర్మల్ రూరల్ మండలం అక్కపూర్లో మంగళవారం నిర్వహించిన రెవెన్యు సదస్సులకు అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్తో కలిసి హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన కలెక్టర్కు ఎంపిడీవో రాధ కనకాపూర్ నర్సరీలో పెంచిన పైన్ ఆపిల్ మొక్క అందించి స్వాగతం పలికారు. తమ నర్సరీలో పెంచిన మొక్కతో స్వాగతం పలకడం సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన వృద్ధురాలు తనకు ఇద్దరు కుమారులని సమానంగా భూములు పంపకం చేసి ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించగా స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ అన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గతంలో అన్నదాతలు తమ భూసమస్యల పరిష్కారానికి రోజుల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే వారని, సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్రెడ్డి సూచనల మేరకు జిల్లాలలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతి పోర్టల్తో రైతులు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని పేర్కొన్నారు. గ్రామాలలో సదస్సులు నిర్వహించడానికి రెండు రోజుల ముందుగానే గ్రామంలో చాటింపు చేయించి రైతులకు తెలిసేలాగా చేస్తున్నామన్నా రు. తమ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సమయంలో ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలిపితే రశీదు పొందాలని సూచించారు. ఈనెల 20వ తేదీ వరకు రెండో విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. రెవెన్యూ అధికారులు దరఖాస్తులను స్వీకరించి, వెంటనే రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. కుంటాల మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సదస్సులు నిర్వహించామని, అక్కడ వచ్చిన సమస్యలలో 50 శాతం పరిష్కరించామని తెలిపారు. సదస్సులలో తీసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరిస్తామని వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూసమస్యలు పరిష్కరించు కోవాలని సూచించారు. అక్కాపూర్ పాఠశాలలో తరగతిగదులు, ఇంకుడు గుంత, లైటింగ్ వంటి వసతులను కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధ, ఎంపీవో అమీర్ఖాన్ పాల్గొన్నారు.