
పేదల సొంతింటి కల సాకారం
● మంత్రి సీతక్క ● అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముధోల్/లోకేశ్వరం: పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. లోకేశ్వరం, ముధోల్ మండలాల్లో మంగళవారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముధోల్ మండలం బ్రాహ్మణ్గావ్లో గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామరావుపటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్లతో కలిసి రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యగా స్టీల్ బ్యాంకును ఆవిష్కరించారు. దౌనెల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు, తానూర్ బీటీ రోడ్డు సహా రూ.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. రూ.1.90 కోట్లతో కుంటాల–దౌనెల్లి రోడ్డు, రూ.5.9 కోట్లతో తానూర్–హుండా రోడ్డు రినివల్, రూ.10 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
లోకేశ్వరంలో కుమురంభీం విగ్రహావిష్కరణ
లోకేశ్వరం మండల కేంద్రంలో కుమురంభీం విగ్రహాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీలు తమ సంస్కృతి, భాష, ఆచారాలను కాపాడుకోవాలన్నారు. హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అర్లి నుంచి ముధోల్ వరకు రోడ్డు నిర్మాణం, ముధోల్లో డిగ్రీ ఆశ్రమ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీల కుల ధ్రువీకరణ పత్రాల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్కుమార్, ఎమ్మెల్యేలు రామారావుపటేల్, వెడ్మ బొజ్జుపటేల్, భైంసా వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ ఆనంద్రావుపటేల్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్రెడ్డి, ఆదివాసీ నాయకపోడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సట్ల అశోక్, ఉపాద్యక్షుడు వెంకగారి భూమయ్య, జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి జగదీష్, పీఏసీఎస్ చెర్మన్ రత్నకర్రావు, నాయకులు సుదర్శన్రెడ్డి, బోడికె సాయన్న, రాజేశ్బాబు, శ్రీధర్, చిన్నారావు, విగ్రహదాత జయసాగర్రావు తదితరులు పాల్గొన్నారు.