
పేదలకూ కార్పొరేట్ విద్య
● టెన్త్ మెరిట్ ఆధారంగా ఇంటర్లో సీట్లు ● ఈ నెల 31వరకు దరఖాస్తు గడువు
నిర్మల్చైన్గేట్: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ చా లా కీలకమైంది. చాలామందికి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదవాలనే కోరిక ఉంటుంది. కానీ.. కార్పొరేట్ విద్య పేదలకు అందని ద్రాక్షే. కాగా, ప్ర తిభ గల పేద విద్యార్థుల కల సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్పొరేట్ విద్యా పథకాన్ని తీసుకువచ్చింది. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ ఉజ్వ ల భవిష్యత్కు బాటలు వేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ పథకానికి సంబంధించి 2025–26 విద్యాసంవత్సరానికి గాను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం అందించనుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 400పైగా మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, ఎయిడెడ్, కేజేబీవీ, నవోదయ, గురుకుల, ఆదర్శ పాఠశాలల్లో చదివినవారే అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు కళాశాలతో కూడిన సమాచారం అందిస్తారు.
ఇదీ.. ఎంపిక విధానం
ఉచిత కార్పొరేట్ విద్య కోసం అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కులతో పాటు ఆయా వర్గాలకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఏ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్లో సీటు కేటాయించారో తెలుపుతూ దరఖాస్తులో పొందుపరిచిన సెల్ నంబర్కు సంక్షిప్త సమాచారం పంపిస్తారు. అందులో సూచించిన గడువులోపు వారికి కేటాయించిన కళాశాలకు వెళ్లి అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేసి జాయిన్ కావాలి. నిర్ణీత గడువులోపు చేరకుంటే సీటు రద్దు చేసి ఆ తరువాత మెరిట్లో ఉన్న వారికి కేటాయిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
కార్పొరేట్ విద్యాపథకం ప్రతిభ గల పేద విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్లపాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య, వసతి కల్పిస్తారు.
– రాజేశ్వర్గౌడ్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి
దరఖాస్తు విధానం ఇలా..
మీసేవా కేంద్రాల ద్వారా telangan aepass. cgg. gov. in లో ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి పూర్తి వివరాలు, పదో తరగతి మార్కుల ధ్రువపత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఆదాయం, కుల ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలకు మించకూడదు. ఒక్కో విద్యార్థి పేరిట ప్రభుత్వం రూ.36 వేల చొప్పున సదరు కళాశాలకు ప్రోత్సాహకం అందించనుంది.

పేదలకూ కార్పొరేట్ విద్య