చైనాకు చెక్‌: రూ. 50 వేల కోట్లతో ప్రాజెక్ట్‌-75కి ఆమోదం

Defence Ministry Clears Rs 50000 Crore Tender For 6 Submarines - Sakshi

అనుమతులు జారీ చేసిన భారత రక్షణ మంత్రిత్వ శాఖ

‘మేక్‌ ఇన్‌ ఇండియా’లో భాగంగా 6 జలంతర్గాముల నిర్మాణానికి ఆమోదం

న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా రోజుకో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ అన్ని రకాలుగా సిద్ధవవుతోంది. ఈ క్రమంలో భారత నావికా దళం కోసం తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్-75కి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా 50 వేల కోట్ల రూపాయలతో ఆరు జలంతర్గాముల నిర్మాణానికి తుది అనుమతి లభించింది. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఈ జలంతార్గాములను నిర్మించనున్నారు. ఈ క్రమంలో రెండు భారతీయ కంపెనీలు, ఓ విదేశీ కంపెనీతో కలిసి పనిచేయడానికి అనుమతిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌పీఎఫ్‌)ను జారీ చేసింది. 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన డిఫెన్స్‌ సమావేశంలో ఆర్‌ఎఫ్‌పీకు క్లియరెన్స్ ఇచ్చారు. మజాగావ్‌ డాక్స్ (ఎండీఎల్), ప్రైవేట్ షిప్-బిల్డర్ లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) లకు రక్షణ శాఖ ఆర్‌ఎఫ్‌పీ జారీ చేసింది. ఈ రెండు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా క్రింద కలిసి పని చేస్తాయి. అంతేకాక భారత వ్యూహాత్మక భాగస్వాములు అయిన ఎండీఎల్‌, ఎల్‌ఆండ్టీ‌ కపెంనీలు.. సాంకేతిక, ఆర్థిక బిడ్లను సమర్పించడానికి ఎంపిక చేసిన ఐదు విదేశీ షిప్‌యార్డులలో ఒకదానితో జతకడతాయి.

ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరు అధునాతన జలంతర్గాములను మజగావ్‌ డాక్‌యార్డ్‌లో వీటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కార్పీన్‌ క్లాస్‌ జలంతర్గాముల కంటే దాదాపు 50శాతం పెద్దదైన ఈ ప్రాజెక్టు కింద ఆరు సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములను నిర్మించాలని భారత నావికాదళం భావిస్తోంది. ఈ జలాంతర్గాముల తయారీలో 95 శాతం దేశీయ వస్తువుల వినియోగించనున్నారు. మారిటైమ్ ఫోర్స్ స్పెసిఫికేషన్ల ప్రకారం.. జలాంతర్గాముల్లో హెవీ డ్యూటీ ఫైర్‌పవర్, కనీసం 12 ల్యాండ్ అటాక్ క్రూయిస్ క్షిపణులు (ఎల్‌ఐసీఎం), యాంటీ షిప్ క్రూయిస్ క్షిపణులు (ఏఎస్‌సీఎం) ఉండాలి.

కొత్తగా అభివృద్ది చేయబోయే జలంతర్గాములు సముద్రంలో 18 హెవీవెయిట్ టార్పెడోలను మోసుకెళ్లే, ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని నేవీ పేర్కొంది. తర్వాతి తరం స్కార్పియన్ శ్రేణి  కంటే ఎక్కువ ఫైర్‌పవర్ అవసరం. ప్రస్తుతం భారత నావికాదళంలో 140కి పైగా జలాంతర్గాములు, ఉపరితల యుద్ధ నౌకలు ఉన్నాయి. పాక్‌ నావికాదళంలో 20 మాత్రమే ఉన్నాయి. మరోవైపు హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నావికాదళాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి భారత నావికాదళం అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది.

చదవండి: ఇండో – పసిఫిక్‌ చౌరస్తా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top