అస్సాం రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు!బీజేపీ పైచేయి
అస్సాంలో రాజ్యసభ ఎన్నికల్లో అసలైన రాజకీయం కనిపించింది. ఉన్న రెండు రాజ్యసభ సీటులను బీజేపీ, దాని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఓ ఎమ్మెల్యే చేసిన పనితో కాంగ్రెస్ కొంప నిండా మునిగింది. దీంతో ఆ ఎమ్మెల్యేపై తక్షణ చర్యలు తీసుకుంది పార్టీ. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలుసా?
గురువారం అస్సాం శాసనసభలో.. రెండు రాజ్యసభ సీట్ల కోసం ఓటింగ్ జరిగింది. ఒక సీటును బీజేపీ అభ్యర్థి పవిత్ర మార్గేరీటా ఏకపక్షంగా దక్కించుకోగా.. రెండో సీటు రసవత్తరమైన రాజకీయం నడిచింది. రూపిన్ బోరా(కాంగ్రెస్ తరపున), బీజేపీ అభ్యర్థి నర్జారీ(యూపీపీఎల్ అభ్యర్థి) రెండో సీటు కోసం పోటీ పడ్డారు. ఈ పోటీలో ఏఐయూడీఎఫ్(ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) బోరాకు మద్ధతు ఇచ్చింది. ఈ సీటు గెలవాలంటే.. అభ్యర్థికి 43 సీట్లు వస్తే సరిపోతుంది.
మొత్తం ఓట్లలో.. అధికార బీజేపీ దాని మిత్రపక్షాల కూటమికి 83 ఓట్లు ఉన్నాయి. ఇందులో పవిత్ర మార్గరీటా కోసం సరిపడా ఓట్లు బీజేపీకి అప్పటికే ఉన్నాయి. అయితే నర్జారీ కోసం మాత్రం మూడు ఓట్లు తక్కువ అయ్యాయి. ఇక ప్రత్యర్థి కూటమికి 44 ఓట్లు ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తన ఓటును వేస్ట్ చేశాడు.
ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న సీఎం హిమంత బిస్వా శర్మ(కుడి నుంచి నాలుగో వ్యక్తి)
ఓటింగ్ టైంలో బ్యాలెట్ పేపర్ మీద One అని రాయకుండా 1 అని నెంబర్ వేశాడు. దీంతో ఆ ఓటు పనికి రాకుండా పోయింది. ఈ చర్యకు ప్రతిగా విప్ ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తానేమీ ద్రోహం చేయలేదని, ఈ విషయంపై హైకమాండ్ను కలిసి వివరణ ఇస్తానని అంటున్నారు సదరు ఎమ్మెల్యే. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి, కరీమ్గంజ్(సౌత్) ఎమ్మెల్యే సిద్ధిఖీ అహ్మద్.
Assam has reposed its faith in PM Sri @narendramodi ji by electing two NDA candidates to the Rajya Sabha by huge margins - BJP's Sri Pabitra Margherita (won by 11 votes) & UPPL's Sri Rwngwra Narzary (won by 9 votes).
My compliments to winners @AmitShah @JPNadda @blsanthosh pic.twitter.com/Lozn8hkNGg
— Himanta Biswa Sarma (@himantabiswa) March 31, 2022
మరోవైపు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో నర్జారీ గెలపు నల్లేరు మీద నడకే అయ్యింది. నర్జారీకి 44 ఓట్లురాగా, బోరాకు 35 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. గతంలో కాంగ్రెస్ నేత. 2015లో ఆయన బీజేపీలో చేరారు. ఈ కారణంగా.. పాత పరిచయాలను ఆసరాగా చేసుకుని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేసింది కాంగ్రెస్.