
భవనం.. భద్రమేనా?
● శ్రీశైల క్షేత్రంలో కొనసాగుతున్న భవన నిర్మాణాలు ● నామమాత్రంగా క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు ● ప్రైవేట్ సత్రాల నిర్మాణాలపై పర్యవేక్షణ చేపట్టని దేవస్థానం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనునిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. దేవస్థానం నిర్మించిన పలు భవనాల ద్వారా భక్తులు వసతి పొందుతున్నారు. భక్తులకు వసతి, అన్నప్రసాదం అందించేందుకు పలు ప్రైవేట్ సత్రాలు సైతం వెలిశాయి. అయితే ఇటీవల సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో శ్రీగిరిలో ఉన్న భవంతులు భద్రమేనా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. శ్రీగిరిలో దేవస్థాన భవంతులతో పాటు దాతలు సహకారంతో అనేక ప్రైవేట్ కాటేజీలు, ప్రైవేట్ సత్రాలు సైతం నిర్మిస్తున్నారు. ఆయా నిర్మాణాల నాణ్యత ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా క్షేత్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు సైతం క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ తమకు తెలిసిన ల్యాబ్లో వారికి అమ్యామ్యాలు ఇచ్చుకుని తెచ్చుకుంటున్నట్లు సమాచారం. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాకుండా దాతల సహకారంతో పలు కాటేజీలు సైతం నిర్మిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం సహకారంతో పలువురు దాతలు పలు కాటేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. దేవస్థానం స్థలం కేటాయిస్తే అందులో దాతలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో కాటేజీ నిర్మాణాలు చేపట్టి దేవస్థానానికి అప్పగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆయా నిర్మాణాల బాధ్యత పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్కు అప్పగిస్తున్నారు. ఎవరు తక్కువ ధరకు నిర్మిస్తామని ముందుకు వస్తే వారికి అప్పగిస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు గాలికొదిలేస్తున్నారు.
కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారనేది ఆ పర మేశ్వరుడికే ఎరుక అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ స్థానికంగా ఉంటే..
శ్రీశైల దేవస్థానం చేపట్టే అభివృద్ధి పనులు, ప్రైవేట్ సత్రాల, కాటేజీల నిర్మాణాలు పూర్తిస్థాయిలో నాణ్యతగా ఉండాలంటే శ్రీశైలంలోనే క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటు చేసి, తరచూ పరీక్షలు నిర్వహించాలి. తద్వారా నాసిరకం పనులకు చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం చేపట్టిన పనులపై దేవస్థానం పర్యవేక్షించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
నాణ్యత ప్రమాణాలు గాలికి..
దేవస్థాన ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు నివసిస్తున్న శివసదనం
శ్రీశైల క్షేత్రంలో చేపట్టే ఆయా అభివృద్ధి కార్యక్రమా ల్లో నామమాత్రపు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా పనుల కు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు తెలిసిన ప్రైవేట్ క్వాలి టీ కంట్రోల్ ల్యాబ్లో ముడుపులు ఇచ్చి ధ్రువీకరణ సర్టిఫికెట్లు తీసుకువస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీశైలంలో చేపట్టిన ఔటర్రింగ్రోడ్డు, గణేశసదన్ (224 గదుల వసతి సముదాయం), పుష్కరిణి, మాడవీధులు, నక్షత్రవనం తదితర పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని పలువురు విజిలెన్స్కు ఫిర్యాదులు చేయడంతో ఆయా పనులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది.
గతంలో భక్తులకు వసతి సౌకర్యార్థం శ్రీశైలంలో నిర్మించిన వెంకయ్యసత్రం, పొన్నూరు సత్రం, పెద్దసత్రం, శివసదనం, పలు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని ప్రస్తుతం భక్తులకు వసతి గదులుగా కేటాయించడం లేదు. అయితే వాటిని దేవస్థానంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు కేటాయించారు. ఈ భవంతులు నిర్మించి సుమారు 30 సంవత్సరాలు అవుతున్నట్లు సమాచారం. ఆయా భవనాలలో సుమారు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. శ్రీగిరి ఉన్న ఆ భవనాలు భద్రమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సింహాచలం అప్పన్న ఆలయంలో చోటు చేసుకున్న సంఘటనలు ఇక్కడ చోటు చేసుకోకుండా అధికారులు ఆయా భవంతులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

భవనం.. భద్రమేనా?

భవనం.. భద్రమేనా?

భవనం.. భద్రమేనా?