
ఉయ్యాలవాడ: రహదారి సౌకర్యం లేక నాలుగు దశాబ్దాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న హరివరం, సర్వాయిపల్లె గ్రామాల ప్రజల కల సాకారానికి ఎట్టకేలకు పునాది పడింది. హరివరం గ్రామం నుంచి ఆర్.పాంపల్లెకు 8 కిలో మీటర్ల తారురోడ్డు నిర్మాణం రూ. 4.16 కోట్లు, సర్వాయిపల్లె నుంచి వయా చిన్నకందుకూరు మీదుగా చింతకొమ్మదిన్నె జాతీయ రహదారి వరకు 7.5 కిలో మీటర్ల తారురోడ్డు నిర్మాణం కోసం రూ. 5.50 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం హరివరం గ్రామం నుంచి ఆర్.పాంపల్లె రహదారి నిర్మాణానికి నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని విమర్శించే టీడీపీ నాయకులు క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజలను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు. ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రహదారు నిర్మాణాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ జేఈ జయన్న, జెడ్పీటీసీ సభ్యురాలు కసాని పుణ్య లక్ష్మీదేవి, గ్రామ సర్పంచ్ నడిపెన్న, ఉప సర్పంచ్లు ఎర్రి శ్రీనివాసరెడ్డి, కందుల వెంకటసుబ్బారెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు పల్లె మహేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గజ్జెల కృష్ణారెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, తరిగోపుల ప్రసాద్రెడ్డి, శివరామిరెడ్డి, ఆరికట్ల శివరామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ. 9.66 కోట్లతో
రహదారి పనులకు శ్రీకారం