‘మద్దిమడుగు’ హుండీ ఆదాయం రూ.19 లక్షలు

నాగయ్య (ఫైల్‌)  - Sakshi

అమ్రాబాద్‌: పదర మండలంలోని మద్దిమడుగు శ్రీపబ్బతి ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా మూడు నెలలకు సంబంధించి హుండీ ఆదాయం రూ.19,01,700 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ విష్ణుమూర్తి తెలిపారు. అలాగే 2,510 గ్రాముల మిశ్రమ వెండి వచ్చిందన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరి, ఆలయ ఈఓ రంగాచారి, అర్చకులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

కందనూలు: ఆర్టీసీ బస్సుల వేళలు, కార్గో సేవ లు, రూట్లలో ఎదురవుతున్న సమస్యలు, ఇతర అంశాలకు సంబంధించి బుధవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్‌ ధరంసింగ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సెల్‌ నం.99592 26288కు ఫోన్‌ చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.

కల్వకుర్తి టౌన్‌: డిపో పరిధిలో బుధవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సందేహాలు, సూచనలు, సలహాలు ఉన్నవారు మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు సెల్‌ నం.99592 26292కు ఫోన్‌ చేయాలని సూచించారు.

పంట ఎండిపోయిందని.. రైతు బలవన్మరణం

కల్వకుర్తి రూరల్‌: చేతికొచ్చిన వరిపంట కళ్ల ముందే ఎండిపోతుందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జీడిపల్లికి చెందిన నాగయ్య(42) కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వ సమీపంలో ఎకరా పొలం ఉండగా మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వరిపంట సాగు చేశారు. ప్రస్తుతం పంట వరిగింజలకు నీళ్లు తీసుకునే దశలో ఉంది. అయితే కేఎల్‌ కాల్వల్లో 15 రోజుల క్రితం సాగునీటి విడుదల నిలిపివేశారు. దీంతో కాల్వల్లో నీరు పారక వరిపంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. సోమవారం పంటకు పక్క పొలం వారి సహకారంతో నీటిని అందించాడు. కానీ, పంట కోలుకునే పరిస్థితి కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పొలంలోనే పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పక్క పొలం రైతులు గమనించి నాగయ్యను కల్వకుర్తి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబసభ్యులు మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. గతంలోనూ పత్తి పంట సాగు చేసినా దిగుబడి రాక అప్పుల్లో కూరుకుపోయాడని, ప్రస్తుతం వరిపంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ ఘటనపై నాగయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Nagarkurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top