
అకాల వర్షం.. తీరని నష్టం
ఈ ఫొటోలోని రైతు పేరు అలుగం సమ్మయ్య. చల్వాయి గ్రామం. గౌరారం శివారులోని 5 ఎకరాల్లో 962 వరంగల్ వరి రకం పంట సాగు చేశాడు. బుధవారం రాత్రి 9గంటలకు వచ్చిన గాలివాన బీభత్సానికి పంట మొత్తం నేలవాలింది. దీంతో పంటసాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని పొలంలో కూర్చోని కన్నీటి పర్యంతం అయ్యాడు.
● కోతకొచ్చిన సుమారు 500 ఎకరాల్లో నేలవాలిన వరి
● కన్నీటిపర్యంతం అవుతున్న అన్నదాతలు
● ఆదుకోవాలని వేడుకోలు
ములుగు/గోవిందరావుపేట: అకాల వర్షాలతో అన్నదాతలు అష్టకష్టాల పాలవుతున్నారు. జిల్లాలో బుధవారం రాత్రి వచ్చిన గాలి దుమారం, కురిసిన అకాల వర్షానికి కోతకొచ్చిన వరి పంట నేలవాలింది. పలుచోట్ల ధాన్యం గింజలు రాలిపోయాయి. ధాన్యం రాశులు తడిసిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
కల్లాల్లో తడిసిన ధాన్యం
ములుగులో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 9:30గంటల వరకు గాలివాన బీభత్సానికి ధాన్యం రాశులపై పరదాలు కొట్టుకపోయాయి. పలుచోట్ల టార్పాలిన్ కవర్లు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం ధాన్యం ఆరుతుందని కప్పిన పరదాలను తొలగించిన రైతులు చదును క్రమంలో మళ్లీ ఒక్కసారిగా కురిసిన వర్షంతో పూర్తిగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా అవస్థలు పడుతూ కనిపించారు. స్పందించిన మంత్రి సీతక్క రైతులు అధైర్యపడకూడదని శుక్రవారం నుంచి హన్మకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మిల్లులకు ధాన్యం తరలిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ములుగు మండలంలో 26.4ఎంఎం, వెంకటాపురం(ఎం) మండలంలో22.8 ఎంఎం, ఎస్ఎస్ తాడ్వాయిలో 9.6 ఎంఎం, గోవిందరావుపేటలో 9.2, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే భారీ గాలి దుమారానికి ములుగు, వెంకటాపురం(ఎం) మండలాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో బుధవారం రాత్రి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం ఉదయం కొన్ని కాలనీలకు విద్యుత్ సరఫరా చేసిన అధికారులు 10గంటల తర్వాత మళ్లీ కోత విధించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. రాత్రి 7:50గంటలకు ములుగు పట్టణంలోని అన్ని కాలనీలకు విద్యుత్ సరఫరా చేశారు.
సుమారు 500ఎకరాల్లో నేలవాలిన వరి
గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి, గోవిందరావుపేట, పస్రా, దుంపెల్లిగూడెం, లక్ష్మీపురం, కర్లపల్లి, మొద్దులగూడెం గ్రామాల్లో 20రోజుల నుంచి 5, 6రోజులకొకసారి కురుస్తున్న అకాల వర్షాలకు వరిధాన్యం రాలిపోయి మొలకెత్తుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతన్నలు గుండెలు బాదుకుంటున్నారు. యాసంగిలో సాగు చేసిన పంటలు కొన్ని చోట్ల కోసినా అవి కాస్త కాంటాలు కాక వివిధ రకాల కారణాలతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై పట్టాలు కప్పి కాపాడుకుంటున్నారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మండల వ్యాప్తంగా సుమారుగా 500ఎకరాల్లో వరి పంట నేలవాలింది. అకాల వర్షాలు ఇలాగే కురిస్తే ధాన్యం రాలిపోయి మొలకలు వచ్చే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
చేతికొచ్చిన పంట నష్టపోయాం..
ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట అకాల వర్షానికి పంట దెబ్బతింది. మా గోస ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు. కౌలుకు తీసుకుని పంట సాగు చేశాను. చేతికి అందివచ్చి న పంట నేలవాలిపోయింది. దాన్ని ఎలా కోయించాలో అర్ధం కావడం లేదు.
– సూరపనేని నాని, రైతు, చల్వాయి
70శాతం ధాన్యం నేలరాలింది..
ఆరుగాలం కష్టపడి 6 ఎకరాల్లో వరి పంట పండించాను. 24గంటలు పంటను రక్షించుకున్నాను. అకాల వర్షాలు గాలిదుమారానికి రేపు కోయాల్సిన వరి ధాన్యం 70శాతం నేలరాలింది. దీంతో తీవ్రంగా పంట నష్టపోయాను. ప్రభుత్వం ఆదుకోవాలి. లేదంటే ఆత్మహత్యనే శరణ్యం.
– కొన్నె అశోక్, రైతు, చల్వాయి

అకాల వర్షం.. తీరని నష్టం

అకాల వర్షం.. తీరని నష్టం

అకాల వర్షం.. తీరని నష్టం