
రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం నిల్వలు
● మూడు నెలలుగా అక్కడే.. ● జిల్లాలో 5,335 క్వింటాళ్లు ● తరలింపునకు ఆదేశాలు రాలేదంటున్న అధికారులు ● డీలర్ల అవస్థలు
మంచిర్యాలఅగ్రికల్చర్: పేద ప్రజల ఆత్మగౌరవం కోసం మూడు నెలలుగా ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే మార్చి నెలలో సరఫరా చేసిన దొడ్డుబియ్యం రేషన్ దుకాణాల్లో నిల్వలుగా మిగిలి, మూడు నెలలుగా ముక్కిపోతున్నాయి. జిల్లాలోని 423 మంది రేషన్ దుకాణాల్లో 5,335.03 క్వింటాళ్ల బియ్యం పేరుకు పోవడంతో డీలర్లలో ఆందోళన నెలకొంది. పురుగులు, ఎలుకలు, వర్షాకాల సమస్యలతో నిల్వలు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు.
డీలర్ల ఇబ్బందులు..
మార్చిలో సరఫరా చేసిన దొడ్డుబియ్యం నెలల తరబడి రేషన్ దుకాణాల్లో నిల్వ ఉండటంతో పురుగులు పట్టడం, తుట్టెలు కట్టడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలుకల సంచారం ఉన్న ప్రాంతాల్లో బియ్యం నష్టపోయే అవకాశం ఉంది. తిరిగి బియ్య ం తీసుకునే సమయంలో నిల్వల లెక్కల్లో తేడాలు వస్తాయని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రేష న్ దుకాణాల్లో సరిపడా నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో, బయట వరండాల్లో బియ్యం ఉంచాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఈ నిల్వలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
సన్న బియ్యం పంపిణీ..
ఏప్రిల్ నుంచి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేపట్టడంతో, పోర్టబులిటీ సౌకర్యం కారణంగా కా ర్డుదారులు ఏ రేషన్ దుకాణంలోనైనా బియ్యం తీ సుకునే అవకాశం పొందారు. దీంతో డీలర్లు నిర్ణీత కోటాకు మించి బియ్యం తీసుకున్నారు. అయితే, సన్నబియ్యం పంపిణీతో దొడ్డుబియ్యం నిల్వలు భారీగా మిగిలిపోయాయి. ఒక్కో దుకాణంలో 10 నుంచి 50 క్వింటాళ్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం మిగులు బియ్యం తిరిగి తీసుకోకపోవడంతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రేషన్ పంపిణీ విధానం..
రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డు (ఎఫ్ఎస్సీ) హోల్డర్లకు ఒక్కో యూనిట్కు 6 కిలోలు, అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులకు 30 కిలోలు, అన్నపూర్ణ అన్నయోజన (ఏఏవై) కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. సాధారణంగా ప్రతీనెల 1 నుంచి 15 వరకు పంపిణీ జరిగేది. కానీ కేటాయింపుల ఆలస్యం వల్ల ఈ నెల 30వరకు పంపిణీ చేయనున్నారు. మూడు నెలల బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులు మూడుసార్లు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉండటంతో దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
మూడు నెలల కోటా సరఫరా..
వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదలు, రవాణా స మస్యల వల్ల బియ్యం సరఫరాలో అంతరాయం ఏ ర్పడకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తుగా జూన్, జులై, ఆగస్టు మాసాల బియ్యం సరఫరా చేపట్టారు. గత నెల కోటా 43,139.19 క్వింటాళ్లు కాగా మూడు నెలలకు 1.30 లక్షల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని 423 రేషన్ దుకాణాల ద్వారా 2,20,055 మంది కార్డుదారులకు ఈ నెల 1 నుంచి 30 వరకు బియ్యం అందజేస్తున్నారు. అయితే దొడ్డుబియ్యం నిల్వలు ఖాళీ చేయకపోవడం డీలర్లకు ఇబ్బందిగా మారింది.