
లంచావతారులు..
● ఏసీబీకి పట్టుబడుతున్నా మారని తీరు.. ● పెరిగిన అవినీతి నిరోధక శాఖ దాడులు ● వాయిస్ రికార్డ్, ఫోన్ పే రిసిప్ట్లు ఉన్నా ఊచలు లెక్కపెట్టాల్సిందే ● తాజాగా మంచిర్యాల డిప్యూటీ తహసీల్దార్ మంజుల, చైన్మెన్ ఉదయ్ అరెస్ట్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత మూడేళ్లలో నమోదైన కేసులు...
సంవత్సరం కేసులు
2022 06
2023 09
2024 12
2025 మే వరకు 08
మంచిర్యాలక్రైం: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ని ఏర్పాటు చేసినా అధికారుల తీరు మారడం లేదు. జిల్లాస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు లంచం లేనిదే పనులు జరగని దుస్థితి నెలకొంది. ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్నా కొందరు అధికారులు డబ్బు కోసం అడ్డదా రులు తొక్కుతూ ప్రభుత్వ శాఖలకు అప్రతిష్ట తెస్తున్నారు.
రాజకీయ ముద్రతో అవినీతి
ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ ప్రభావం సర్వసాధారణంగా మారింది. అధికారంలో ఉన్న నాయకులు తమకు అనుకూలమైన అధికారులకు కావాల్సిన పోస్టింగ్లు ఇప్పిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖల్లో అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం అధికారులు లక్షల రూపాయలు చెల్లించి, నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ పెట్టుబడిని రాబట్టేందుకు అధికారులు లంచం రూపంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. కొందరు అధికారులు పనికి రేటు నిర్ణయించి, డబ్బు చెల్లించకపోతే పని చేయకుండా బహిరంగంగా చెప్పేస్తున్నారు.
ఏసీబీ దూకుడు..
స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, ఏసీబీ అధికారుల సమాచారం సులభంగా అందుబాటులోకి రావడంతో లంచం డిమాండ్ చేసే అధికారులు సులభంగా ఏసీబీకి చిక్కుతున్నారు. ప్రజలు ఇప్పుడు అవినీతి అధికారులపై ఫిర్యాదు చేయడానికి ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఫోన్పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా లంచం తీసుకునే అధికారులు కూడా ఏసీబీకి చిక్కడం వల్ల ప్రభుత్వ శాఖల పరువు దిగజారుతోంది.
పర్యవేక్షణ పెరిగినా..
జిల్లాల విభజన తర్వాత ఏసీబీ పర్యవేక్షణ పెరిగింది. గతంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు ఒకే ఏసీబీ కార్యాలయం ఉండగా, ప్రస్తుతం మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలకు మంచిర్యాలలో ఒక కార్యాలయం ఏర్పాటైంది. దీంతో ఫిర్యాదులపై వెంటనే స్పందించే అవకాశం పెరిగింది. ఈ నెల 4న మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్ పోలం మంజుల, చైన్మెన్ ఉదయ్కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అలాగే, ఏప్రిల్ 18న సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ ఒక కేసులో లంచం డిమాండ్ చేసి ఏసీబీకి దొరికాడు. గతంలో జిల్లా కేంద్రంలో సీఐగా పనిచేసిన ఓ అధికారి ఏసీబీ రైడ్ను ముందే పసిగట్టి తప్పించుకున్నాడు. ఈ సంఘటనలు అవినీతి అధికారుల తీరు మారడం లేదని సూచిస్తున్నాయి.
భూ వివాదాల్లో అవినీతి
జిల్లా వ్యాప్తంగా భూముల ధరలు పెరగడంతో భూ వివాదాలు కూడా పెరిగాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు ఈ వివాదాలను తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు, రాజీవ్నగర్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఒక వ్యక్తి లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన ప్లాట్పై మరో వ్యక్తి దొంగ పట్టా సృష్టించి వివాదం సృష్టించాడు. ఈ విషయంలో స్థానిక సీఐ, రెవెన్యూ అధికారులు అక్రమ లాభాల కోసం సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి
ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఇవ్వకండి.. ఏసీబీకి సమాచారం ఇవ్వండి. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే అవినీతి రహిత సమాజం కోసం ప్రతీ పౌరుడు తమవంతుగా కృషి చేయాలి. ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్న అధికారుల వివరాలు సైతం ఇవ్వండి. ఏసీబీ అధికారులకు నిర్భయంగా నేరుగా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసేందుకు టోల్ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్ 9154388963 కు ఫిర్యాదు చేయండి. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం.
– విజయ్కుమార్,
ఏసీబీ డీఎస్పీ, మంచిర్యాల
ఇటీవలి ఏసీబీ కేసులు
ఏప్రిల్ 18న సీసీసీ నస్పూర్: ఎస్హెచ్వో సుగుణాకర్ క్షుద్రపూజల పేరుతో రూ.2 లక్షలు జప్తు చేసిన డబ్బును బాధితునికి తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో సుగుణాకర్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
జూన్ 4, మంచిర్యాల డిప్యూటీ సర్వేయర్ మంజుల, చైన్మెన్ ఉదయ్కుమార్ ఒక వ్యవసాయ భూమి సర్వే కోసం రూ.16,500 ఫోన్పే ద్వారా, రూ.10 వేల నగదు తీసుకున్నారు. అయినప్పటికీ మరో రూ.50 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫోన్పే రసీదులు, ఫోన్ సంభాషణల ఆధారంగా వీరిని అరెస్ట్ చేశారు.
ఏసీబీ చర్యలు, పర్యవేక్షణ పెరిగినప్పటికీ, అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రజలు ఏసీబీని ఆశ్రయించడం ద్వారా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే, అవినీతిని పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చట్టాలు, కట్టుదిట్టమైన అమలు, పారదర్శక విధానాలు అవసరం.

లంచావతారులు..