
మురిపించి.. ముఖం చాటేసి
● భగ్గుమంటున్న భానుడు ● రుతుపవనాలు వచ్చినా.. జాడలేని వాన ● వర్షాల అనిశ్చితితో రైతుల్లో ఆందోళన ● మిరుగుపైనే అన్నదాత ఆశలు..
మంచిర్యాలఅగ్రికల్చర్: మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలు రైతుల్లో ఆశలు రేకెత్తించాయి. మిరు గు కార్తెలో విత్తనాలు వేసేందుకు చేలను సిద్ధం చేసుకున్న రైతులు, వారం రోజులుగా వర్షాలు లేకపోవడం, ఎండలు మండిపోవడంతో నిరాశ నెలకొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, ఈ నెలలో చిరుజల్లులకే పరిమితమవుతుండడం రైతులను కలవరపెడుతోంది.
ముందస్తు వర్షాలతో ఆశలు
గత నెల 23 నుంచి 30 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో సగటున 94 మిల్లీమీ టర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో వాతావరణం చల్లబడడంతో రైతులు పొలంబాట పట్టారు. గత ఖరీఫ్, యాసంగి పంటల మొదళ్లను ఏరివేసి, దుక్కులు సిద్ధం చేసుకున్నారు. మిరుగు కార్తె నుంచి ఖరీఫ్ సాగు పనులు ముమ్మరం చేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే, ఈ నెలలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఉదయం ఎండలు మండిపోతుండగా, సాయంత్రం మబ్బులు కమ్మినా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలు ఆలస్యం..
జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. రుతుపవనాల రాకతో తొలకరి వర్షాలు కురిస్తే పంట విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో పత్తి, వరి పంటలు ప్రధానంగా సాగవుతాయి. సాధారణంగా జూన్ చివరి నుంచి జులై చివరి వరకు పత్తి విత్తనాలు వేయగా, జులైలో వరి నారు పోసి, ఆగస్టు చివరి వరకు నాట్లు వేస్తారు. అయితే, గతంలో వర్షాలు ఆలస్యం కావడంతో పంట దిగుబడులు ఆలస్యమై, యాసంగి సీజన్ కూడా వెనుకబడి, ఆకాల వర్షాలతో నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో జూన్లోనే పత్తి విత్తనాలు, జులై చివరి నాటికి వరి నాట్లు పూర్తి చేయాలని రైతులు ఆశించారు. కానీ, వర్షాలు ఆగిపోవడంతో ఈ ఆశలు నిరాశగా మారాయి.
మిరుగుపై ఆశలు..
మిరుగు కార్తె ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రైతులు సాగు పనులను ముమ్మరం చేస్తారు. అయితే, ఈ నెలలో వర్షాలు చిరుజల్లులకే పరిమితమవడంతో, వాగులు, వంకలు పొంగి ప్రవహించే పరిస్థితి లేదు. రెండు లేదా మూడు భారీ వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ కార్తె నుంచి విత్తనాలు వేసే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. మరో వారం వర్షాలు లేకపోతే, ముందస్తు సాగు సాధ్యం కాక, గత సంవత్సరం లాగానే పంటలు ఆలస్యమవుతాయని రైతులు పేర్కొంటున్నారు.
ఆరు రోజుల్లో నమోదైన కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలుతేదీ కనిష్టం గరిష్టం 2 28.4 36.3 3 29.0 37.4 4 28.6 38.2 5 28.2 38.6 6 28.0 37.8
7 29.2 39.4