
రోడ్డు పనులను అడ్డుకున్న అటవీ అధికారులు
తాండూర్: మండలంలోని నర్సాపూర్ గ్రామపంచా యతీలోని బెజ్జాల గ్రామానికి నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు పనులను అటవీ శాఖ బెల్లంపల్లి రేంజర్ పూర్ణచందర్ స్థానిక సిబ్బందితో కలిసి శనివారం అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు అటవీ శాఖ అధి కారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న సీఐ కుమారస్వామి, ఎస్సై సౌజన్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్రెడ్డి అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. బీటీ రోడ్డు చేపట్టిన భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందంటూ ఆ శాఖ అధికారులు పేర్కొంటుండగా, సదరు భూమికి సంబంధించి తమకు రెవెన్యూ పట్టాలు అటవీ హక్కు పత్రాలు ఉన్నాయని గిరిజనులు పేర్కొంటున్నారు. పోలీసులు, నాయకులు కలగజేసుకుని ఇరు వర్గాలతో మాట్లాడారు. అటవీ శాఖ అనుమతులు తీసుకుని పనులు చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే వినోద్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని, రోడ్డు పనులు త్వరితగతిన చేపట్టేలా చేస్తామని స్థానిక నాయకులు హామీ ఇచ్చారు. అంతకుముందు పోచంపల్లి గ్రామంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న వారిని అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. వారం క్రితం ఎమ్మెల్యే వినోద్ ఉన్నతాధికారులతో మాట్లాడారని ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టవద్దని నాయకులు కోరారు. కార్యక్రమంలో డెప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, నాయకులు సూరం దామోదర్రెడ్డి, కాపర్తి సుభాష్, బానేష్, పర్వత రావు, అమృతరావు, మాణిక్రావు, భగవంతురావు తదితరులు పాల్గొన్నారు.