● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి.. ● చెన్నూర్‌ ఎమ్మెల్యేకు కేబినెట్‌లో చోటు ● ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్‌ను పక్కన బెట్టిన అధిష్టానం ● నేడే ప్రమాణ స్వీకారం.. | - | Sakshi
Sakshi News home page

● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి.. ● చెన్నూర్‌ ఎమ్మెల్యేకు కేబినెట్‌లో చోటు ● ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్‌ను పక్కన బెట్టిన అధిష్టానం ● నేడే ప్రమాణ స్వీకారం..

Jun 8 2025 12:56 AM | Updated on Jun 8 2025 12:56 AM

● ఎట్

● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి.. ● చెన్నూర్‌

మూడో వ్యక్తి..

చెన్నూర్‌ నుంచి గెలిచిన వారిని మంత్రి పదవులు వరిస్తున్నాయి. గతంలో బోడ జనార్దన్‌, గడ్డం వినోద్‌ మంత్రులుగా పనిచేశారు. తాజాగా గడ్డం వివేక్‌ వెంకటస్వామికి ఛాన్స్‌ దక్కింది. 1999 నుంచి 2004 వరకు అప్పటి ఎమ్మెల్యే బోడ జనార్దన్‌ చంద్రబాబు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు ప్రస్తుత బెల్లంపల్లి, ఎమ్మెల్యే నాటి చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా వివేక్‌కు కూడా కేబినెట్‌ బెర్త్‌ ఖరారైంది. దీంతో చెన్నూర్‌ను మూడోసారి మంత్రి పదవి వరించనుంది.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాకు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. మంత్రి పదవి కోసం మొదటి నుంచి కొనసాగుతున్న పీటముడి వీడింది. ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. గతేడాదిన్నరగా తర్జనభర్జనలు కొనసాగగా కేబినెట్‌ విస్తరణకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మాల సామాజికవర్గం నుంచి చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌, మాదిగ సామాజికవర్గం కోటాలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ముదిరాజ్‌ సామాజిక వర్గం నుంచి మక్తల్‌ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి కేబినెట్‌ బెర్త్‌ ఖరారు అయినట్లు తెలిసింది.

ముగ్గురి మధ్య పోటీ..

జిల్లా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి పోటీ పడ్డారు. గాంఽధీభవన్‌ నుంచి ఢిల్లీ వరకు పీసీసీ స్థాయి నుంచి ఏఐసీసీ అధిష్టానం దాకా ముగ్గురూ ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్‌ చేసుకున్నారు. చివరకు అధిష్టానం వివేక్‌నే ఖరారు చేసింది. దీంతో ప్రేమ్‌సాగర్‌, వినోద్‌ కంగుతిన్నారు. అనుచరులు సైతం ఊహించని షాక్‌కు గురయ్యారు. కొద్ది రోజులుగా తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు. వివేక్‌కు పదవి రావడం వారికి మింగుడు పడటం లేదు. మరోవైపు చెన్నూర్‌ ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వివేక్‌ రాజకీయ ప్రస్థానం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్‌ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయనకు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానాలు వచ్చాయి. అధిష్టానం తొలి విడతలోనే పదవీ ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణలు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమోదం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మరో వైపు జిల్లా నుంచే తన సోదరుడు వినోద్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధిష్టానం వివేక్‌ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు  మంత్రి పదవి.. ● చెన్నూర్‌ 1
1/1

● ఎట్టకేలకు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి.. ● చెన్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement