మావోలపై పోలీసుల పైచేయి! | - | Sakshi
Sakshi News home page

మావోలపై పోలీసుల పైచేయి!

Jun 8 2025 12:44 AM | Updated on Jun 8 2025 12:44 AM

మావోల

మావోలపై పోలీసుల పైచేయి!

అడెల్లుకు మామిడిగట్టుతో అనుబంధం

సాక్షి, ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం చేస్తున్న కృషి ఫలిస్తోంది. నాలుగేళ్ల క్రితం మావోయిస్టు అగ్రనేతలు మైలారపు అడెల్లు, బండి ప్రకాశ్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యకలాపాలపై దృష్టి సారించిన పోలీసులు, అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల అడెల్లు హతమవడంతో జిల్లాలో మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌ భయం గణనీయంగా తగ్గింది.

నాలుగేళ్ల క్రితం వ్యూహం..

నాలుగేళ్ల క్రితం, కరోనా కాలంలో మావోయిస్టు నేతలు అడెల్లు, బండి ప్రకాశ్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రిక్రూట్‌మెంట్‌ కోసం సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డి వారం రోజుల పాటు జిల్లాలో మకాం వేశారు. స్థానిక పోలీసు అధికారులతో రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ, గ్రేహౌండ్స్‌, ఇతర బలగాలతో అడవుల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, అప్పట్లో ఈ ఇద్దరు నేతలు తప్పించుకున్నారు. ఇప్పుడు అడెల్లు హతమవడంతో ఈ జిల్లాపై మావోయిస్టు పట్టు బలహీనపడింది.

ఒకప్పటి ఉద్యమ పరిస్థితి

గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో మావోయిస్టు దళాలు నిత్యం సంచరించేవి. ఒక్కో దళంలో 20 మంది వరకు సభ్యులు ఉండేవారు. కొత్త రిక్రూట్‌మెంట్లు, ప్రజావ్యతిరేక విధానాలను హెచ్చరిస్తూ లేఖలు, రాజకీయనేతలపై దాడులు, విధ్వంసాలు, హత్యలు సర్వసాధారణంగా జరిగేవి. అయితే, గత రెండు దశాబ్దాలుగా జిల్లాలో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లా నుంచి సెంట్రల్‌ కమిటీలో కీలకంగా ఉన్న నేతలు ఇప్పటికీ రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, అడెల్లు మరణంతో వారి కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

కూంబింగ్‌, కాల్పులతో దద్దరిల్లిన అడవులు

గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో పోలీ సు కూంబింగ్‌, మావోయిస్టులతో ఎదురుకాల్పులు, ఎన్‌కౌంటర్‌లు, పోలీసులకు గాయాలు, మరణాలు సాధారణ ఘటనలుగా ఉండేవి. కడెం మండలం అల్లంపల్లిలో జరిగిన ఎదురుకాల్పుల్లో పోలీ సుల మరణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టులు, ఇన్‌ఫార్మర్ల హత్యలు కూడా ఈ జిల్లాలో తరచూ జ రిగేవి. అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి గణనీయంగా మారి, అడవుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

ఒకప్పడు దళాలు, ఇప్పుడు నిశ్శబ్దం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఖానాపూర్‌–సింగాపూర్‌, మంగీ, కాగజ్‌నగర్‌, బోథ్‌, చెన్నూర్‌, ఇంద్రవెల్లి, సిర్పూర్‌ దళాలు మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేవి. కోల్‌బెల్ట్‌ ఏరియాలో సికాసా, జిల్లా స్పెషల్‌ గెరిల్లా స్క్వాడ్‌, మిలిటరీ ప్లాటూన్లు మెరుపుదాడులకు పాల్పడేవి. అయితే, ప్రస్తుతం ఈ దళాల ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. బోథ్‌, బజార్‌హత్నూర్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌, చెన్నూర్‌, జన్నారం, బెల్లంపల్లి అడవుల్లో ఒకప్పుడు కాల్పులతో దద్దరిల్లిన వాతావరణం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది.

మావోయిస్టుల తగ్గుదల

రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 50 మందికి పైగా మావోయిస్టులు చురుకుగా ఉండగా, ఆ సంఖ్య క్రమంగా 20కి చేరింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత, బోథ్‌ మండలం పొచ్చెరకు చెందిన సెంట్రల్‌ కమిటీ సభ్యుడు అడెల్లు మరణం, ఇటీవల జిల్లాకు చెందిన ఒకరిద్దరు మహిళా మావోయిస్టుల మరణంతో జిల్లాలో వారి ఉనికి దాదాపు కనుమరుగైంది.

నేషనల్‌ పార్క్‌లోనే బండి ప్రకాశ్‌!

బీజాపూర్‌ నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మందమర్రికి చెందిన మరో మావోయిస్ట్‌ట్‌ నేత బండి ప్రకాశ్‌ ఆలియాస్‌ ప్రభాత్‌, రమాకాంత్‌, క్రాంతితోపాటు మరో కొంత మంది మూడు రోజులుగా పోలీసు బలగాల అదుపులో ఉన్నారని పౌరహక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసు బలగాలు ఎన్‌కౌంటర్‌ చేసే ప్రమాదం ఉందని, వారిని కోర్టులో హాజరుపర్చాలని పౌరహక్కుల నేతలు ఓ ప్రకటన విడుదల చేయడంతో ఈవిషయం మందమర్రిలో చర్చనీయాంశమైంది.

అడెల్లు ఎన్‌కౌంటర్‌ ఉద్యమానికి

ఎదురుదెబ్బ

పోలీసులకు కంటిమీద కునుకు

లేకుండా చేసిన మావోయిస్టు..

మళ్లీ రిక్రూట్‌మెంట్‌

జరుగుతుందనే భయం

30 ఏళ్ల క్రితమే మామిడిగట్టులో చిక్కాడు

మందమర్రిరూరల్‌: ఛత్తీస్‌గఢ్‌ జిల్లా బీజాపూర్‌

లో గల నేషనల్‌ పార్క్‌ అడవుల్లో ఈనెల 6న ఎన్‌కౌంటర్‌లో జరిగిన మైలారపు అడెల్లు ఆలియాస్‌ భాస్కర్‌ మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మామిడిగట్టు గ్రామంతో ఆయనకు అనుబంధం ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన ఆయన చెన్నూర్‌ దళంలో చాలాకాలం పనిచేశారు. 1996 ప్రాంతంలో మందమర్రి మండలం మామిడిగట్టులో గల ఓ ఇంటిలో షల్టర్‌ తీసుకోగా పోలీసులకు సమాచారం అందింది. అప్పుడు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి అడెల్లును అదుపులో తీసుకున్నారు. ఎలాంటి అరెస్ట్‌ చూయించకుండా ఎన్‌కౌంటర్‌ చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడంతో ఆ షెల్టర్‌ ఇచ్చిన ఆ యజమాని విలేకరులకు విషయాన్ని తెలియజేయడంతో ఆ వార్తను కవరేజ్‌ చేయడంతో ఎన్‌కౌంటర్‌ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. లేకపోతే 30 ఏళ్ల క్రితమే అడెల్లు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందేవాడు. తర్వాత అడెల్లు జిల్లా కార్యదర్శిగా ఇన్‌చార్జిగా ఆలా ఏళ్లుగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయే నాటికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహించాడు. అడెల్లును మావోయిస్ట్‌ పార్టీలోకి తీసుకువచ్చిన నిర్మల్‌ జిల్లాకు చెందిన సుధాకర్‌ (సత్వాజీ) లొంగిపోయినప్పటికీ అడెల్లు మాత్రం పార్టీ సిద్ధాంతాలను నమ్మి చివరివరకు ఉద్యమంలో కొనసాగారు.

బీజాపూర్‌కు కుటుంబీకులు

బోథ్‌: మైలారపు అడెల్లు.. అడవి బాటపట్టి పేద ప్రజల కోసం పనిచేస్తే చంపేస్తారా? కుటుంబాన్ని వదిలి మాకు 30 ఏళ్లు దూరమయ్యాడు. కనీసం ఆయన మృతదేహాన్ని అప్పగించండి.. కడసారి చూడాలని ఉందని కుటుంబీకులు, బంధువులు రోదిస్తున్నారు. ఆయన మృతదేహం అప్పగించాలని కోరుతూ అన్న మైలారపు సీతారాం సహా ఎనిమిది మంది బీజాపూర్‌కు వెళ్లారు. శనివారం హెలికాప్టర్‌లో తీసుకుచ్చిన ఆరుగురు మావోల మృతదేహాల్లో అడెల్లుని గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత అప్పగింతపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని పోలీసులు తెలిపారు.

బాబాయి మృతదేహం అప్పగించండి

మా బాబాయి అడెల్లు మృతదేహాన్ని అప్పగించండి. ఏ తప్పు చేశారని చంపేశారు. తెలంగాణ బిడ్డ ప్రజల కోసమే పోరాడాడు. కుటుంబాన్ని వదిలి మూడు దశాబ్దాలు గడిచింది. ఆయన ప్రజల కోసమే తన జీవితాన్ని వదులుకున్నాడు. ఆయన కుటుంబీకులు అందరూ పేదవారే. కడసారి చూపునకు మృతదేహాన్ని అప్పగించాలి. – గీత, అడెల్లు అన్న కూతురు

మావోలపై పోలీసుల పైచేయి!1
1/2

మావోలపై పోలీసుల పైచేయి!

మావోలపై పోలీసుల పైచేయి!2
2/2

మావోలపై పోలీసుల పైచేయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement