
ప్రతీ హామీ నెరవేర్చడానికి కృషి
నస్పూర్: గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. పట్టణ పరిధిలోని తోళ్లవాగు సమీపంలో సోమవారం జరిగిన కార్యాక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన పలువురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య తీర్చామని, ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించామని అన్నారు. వేంపల్లి, సాయికుంట, వినూత్న కాలనీ మీదుగా తోళ్లవాగుపై బ్రిడ్జి నిర్మించి నస్పూర్లోని రోడ్డుకు అనుసంధానం చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 4000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని, నేడు 1200 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని, త్వరలో మిగతా వారందరికీ అందజేస్తామని తెలిపారు. కొన్ని మీడియాల్లో ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచురితం చేస్తున్నాయని, తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు.
వాళ్లను వదిలి పెట్టే ప్రసక్తే లేదు
పేదల, ప్రభుత్వ సొమ్మును కాజేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తీవ్రంగా హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 25 నుంచి 30 మంది అరాచకాలు సృష్టిస్తూ ప్రజలు, తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేశారని, అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఇప్పటికే ఐదుగురిపై ఆరోపణలు రుజువు చేశామని, మిగతా వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమినర్ శివాజి, నస్పూర్ తహసీల్దార్ సంతోష్కుమార్, నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురమిల్ల వేణు, మాజీ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు