
మట్టిదిమ్మె పడి వలస కూలీ మృతి
వీపనగండ్ల: బతుకుదెరువు కోసం వచ్చి మండల కేంద్రంలో కూలీగా పనిచేస్తున్న బోగమోనిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (42) మట్టిదిమ్మె కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రాణి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన రైతు బాబూజిగౌడ్ భీమా కాల్వ నుంచి తన వ్యవసాయ బావికి పైపులను అమర్చేందుకు పొక్లెయిన్తో కాల్వ తవ్వుతుండగా కాల్వలో పైపులు అమరుస్తున్న వెంకటేష్ మట్టిదిమ్మె కూలి మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ తాలుకా బోగమోనిపల్లి గ్రామానికి చెందిన మృతుడు, అతని భార్య గోవిందమ్మ రెండు సంవత్సరాలుగా బాబూజిగౌడ్ వద్ద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
వృద్ధుడి బలవన్మరణం
చిన్నంబావి: ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే.. మండలంలోని బెక్కెం గ్రామానికి చెందిన గొల్ల సుంకులయ్య (60) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య, కుమారుడు హైదరాబాద్లో పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. దీంతో సుంకులయ్య ఇంటి వద్ద ఒక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకోవడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.
ఇంజినీర్ అనుమానాస్పద మృతి
● ఫిర్యాదు చేసిన మృతుడి భార్య
నవాబుపేట: ప్రైవేట్ మినరల్స్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్న వ్యక్తి అతడు నివాసం ఉండే కంపెనీ గదిలోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతి విషయం బయటికి పొక్కకుండ రెండు రోజులుగా రహస్యంగా ఉంచడంతో అనుమానాలకు తావిస్తోందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కాకర్జాల్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ మినిరల్స్ కంపెనీలో ఆంధ్రప్రదేష్ కృష్ణా జిల్లా, పమిడి ముక్కల మండలం, మంటాడ గ్రామానికి చెందిన పూర్ణచందర్రావు (43) ఏప్రిల్లో మెకానికల్ ఇంజినీర్గా చేరాడు. ఈ నేపథ్యంలో కంపెనీ కేటాయించిన గదిలో నివాసం ఉండేవాడు. కాగా ఈ నెల 2వ తేదీ బుధవారం రాత్రి విధులు ముగించుకొని గదిలో నిద్రించాడు. కాగా గురువారం గదిలో శవమై కనిపించడంతో తోటి ఉద్యోగులు కంపెనీ యాజమాన్యానికి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పూర్ణచందర్రావు మృతిపై అనుమానం ఉందని మృతుడి భార్య దీప్తి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతి విషమమై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు.
చికిత్స పొందుతూవ్యక్తి మృతి
తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 1న మండల పరిధిలోని గౌరారం సమీపంలో బైక్పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతోకాడెద్దులు మృత్యువాత
ఊట్కూరు: విద్యుదాఘాతంతో గుడిసె దగ్ధమవడంతో పాటు కాడెద్దులు సజీవ దహనమైన ఘటన మండలంలోని పెద్దపొర్ల గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లచ్చమ్మ కాడెద్దులను పొలం వద్ద రేకుల షెడ్డులో కట్టేసి గురువారం రాత్రి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా అప్పటికే విద్యుత్ షాక్తో రేకుల షెడ్డు, గుడిసె, కాడెద్దులు, ఎరువులు తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించాడు. సుమారు రూ.2, 50 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వ తరఫున ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నారు.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,260
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మొక్కజొన్న క్వింటాల్కు గరిష్టంగా రూ.2,260, కనిష్టంగా రూ.2,149 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ. 4,400, కనిష్టంగా రూ.3029 ధరలు పలికాయి.

మట్టిదిమ్మె పడి వలస కూలీ మృతి